లోక్సభలో ‘కోతుల బెడద’: చంపేస్తున్నాయంటూ హేమామాలిని సహా ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: కోతుల బెడదపై లోక్సభలో ప్రస్తావించారు భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమామాలిని. వృందావనంలో కోతుల దాడుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీకి పలువరు ఇతర ఎంపీలు కూడా మద్దతుగా మాట్లాడారు.
హేమామాలిని వీధిలో చిరుత: కుక్క అనుకుని తరిమిన గార్డు!
బృందాననంలో..
మథుర ఎంపీ హేమా మాలిని మాట్లాడుతూ.. కోతుల సమస్య వృందావనం(బృందావనం)లో చాలా ఎక్కువగా ఉందని, నివాసాల్లోకి వెళ్లి ఆహార పదార్థాలను తింటున్నాయని చెప్పారు. కోతులతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
ప్రాణాలు కూడా తీస్తున్నాయి..
యాత్రికులు ఇచ్చే కచోరీ, సమోసా లాంటి పదార్థాలను తిని కోతులు అస్వస్థతకు గురవుతున్నాయని, వాటి కారణంగా అక్కడి ప్రజలు కూడా అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. కోతులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అవి చాలా క్రూరంగా దాడులకు తెగబడుతున్నాయని, వృందావనంలో కోతుల దాడుల కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయారని హేమా మాలిని వివరించారు.
సమస్య తీవ్రంగా మారింది..
అయితే, కోతులకు కూడా జీవించే హక్కు ఉంది కానీ, వాటిని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాలని.. ఇందుకు ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోతుల కోసం ‘మంకీ సఫారీ' ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కోతుల సమస్యను చిన్నది చూడవద్దని, ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారిందని హేమామాలిని వివరించారు.
ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు..
ఢిల్లీలోని లూటిన్స్, గార్డెన్స్లో కూడా కోతుల బెడద తీవ్రంగా ఉందని, పిల్లలతో పార్కుల్లో కూర్చోవాలంటే ప్రజలు భయపడిపోతున్నారని ఎల్జేపీ సభ్యుడు చిరాగ్ పాశ్వాన్ సభ దృష్టికి తెచ్చారు. ఢిల్లీ నగరం కూడా కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు. అడవులు తగ్గిపోవడం వల్లే కోతులు మనుషుల నివాసాల్లోకి చొరబడుతున్నాయని, వాటికి అనుకూలమైన పరిస్థితులను కల్పించాలని అభిప్రాయపడ్డారు.
ఫ్రూటీ ఇస్తేనే నా కళ్ల జోడి ఇచ్చిందా కోతి..
టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ కూడా తనకు జరిగిన అనుభవాన్ని వివరించారు. తాను వృందావనంలోని రామకృష్ణ ఆలయానికి తరచూ వెళుతుంటానని.. ఓసారి తన కళ్లజోళ్లను ఓ కోతి లాక్కెళ్లిందని, చివరకు ఓ ఫ్రూటీ ఇచ్చి వాటిని తీసుకున్నట్లు తెలిపారు. కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉందని, ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలని సభ్యులు కోరారు.