'స్టేజ్ గిర్ రాహా హై'తో 'బసంతి' ప్రసంగం ఖతమ్
మథుర: సినీ నటి హేమమాలినికి ప్రచారంలో చిక్కులు తప్పడం లేదు. రెండు గంటలు ఆలస్యంగా ప్రచార సభకు వచ్చిన మథుర బిజెపి అభ్యర్థి బసంతి హేమమాలిని మూడంటే మూడు నిమిషాలు మాత్రమే ప్రసంగించి, అర్థాంతరంగా స్టేజ్ గిర్ రహా హై (వేదిక కూలిపోతోంది)తో ముగించారు. షోలేలో బసంతి పాత్రతో విశేషమైన ప్రజాదరణ పొందిన హేమమాలిన మథుర నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మూడు గంటల పాటు నిరీక్షించిన ప్రజలు ఆమె రాగానే వేదిక వైపు దూసుకురావడానికి ప్రయత్నించారు. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మథుర రిఫైనరీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రాగానే పురుషులు, మహిళలు, పిల్లలు ఒక్కసారిగా వేదికవైపు దూసుకు వచ్చారు. నిర్వాహకులు నియంత్రించడానికి ప్రయత్నించినా ఫలితం లభించలేదు.
వేదిక కూలిపోతుందని దూరంగా ఉండాలని మైక్ ద్వారా హెచ్చరించినా ప్రజలు వినలేదు. ఈ గొడవలోనే హేమమాలిని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మూడు నిమిషాలు మాట్లాడారో లేదో ఏ వైపు వేదిక పడిపోతూ వచ్చింది. దీంతో ఆమె స్టేజ్ గిర్ రహా హై అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. వెంటనే హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వేదిక కూలిపోయే రీతిలో ప్రజలు దూసుకువచ్చారంటే బిజెపికి మద్దతు ఎంత ఘనంగా ఉందో ఊహించుకోవాలని బిజెపి నాయకులు సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.