పుల్వామా ఉగ్రదాడికి గట్టి కౌంటర్.. మోడీపై నమ్మకం : హేమమాలిని
ముంబయి : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు నటి, ఎంపీ హేమమాలిని. కశ్మీర్ లో శాంతి నెలకొల్పేలా అవసరమైన అన్నీ చర్యలు ప్రధాని మోడీ తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడిని మోడీ అంత ఈజీగా తీసుకోరని.. స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారని అభిప్రాయపడ్డారు. ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. మోడీ నేతృత్వంలో ఎంపీగా పనిచేయడం సంతృప్తి ఇస్తోందన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన కేక్ వాక్ లఘుచిత్ర ప్రదర్శనకు ఆమె హాజరయ్యారు. హేమమాలిని కుమార్తె ఈశా అందులో నటించారు.
పుల్వామా ఉగ్రదాడి ఘటనతో దాదాపు సినిమా కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్లు తెలిపారు హేమమాలిని. అయితే కేక్ వాక్ లఘుచిత్ర ప్రదర్శనకు అన్నీ ఏర్పాట్లు జరిగిపోవడంతో వాయిదా వేయడానికి వీలుపడలేదన్నారు.
పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా నలసాపరాలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారిన ఘటనపై హేమమాలిని స్పందించారు. దేశ రక్షణ గురించి ఆలోచించేవాళ్లైతే నిరసన ర్యాలీలు చేయబోరని.. వారికి చిత్తశుద్ది ఉంటే అమరవీరుల కుటుంబాల దగ్గరకు వెళ్లి సంతాపం ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.