ఆర్టిస్ట్ హేమ హత్య: మరో ముగ్గురు నిందితుల అరెస్ట్
ముంబై: ప్రముఖ ఆర్టిస్ట్(చిత్రకారిణి) హేమా ఉపాధ్యాయ్, ఆమె తరపు న్యాయవాది హరీశ్ భాంభానీల హత్య కేసులో మరో ముగ్గురు నిందితుల్ని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య మొత్తం నాలుగుకు చేరింది.
సోమవారం వారణాసిలో ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న శివ కుమార్ అలియాస్ సిధూ రాజ్భర్ని స్పెషల్ టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అరెస్టైన వారిలో టెంపో డ్రైవర్ అయిన వికాస్ రాజ్భరే అట్టపెట్టెల్లో పెట్టిన హేమా ఉపాధ్యాయ్, హరీశ్ భంభానీల మృత దేహాల్ని ట్రక్కులో తీసుకువెళ్లి కండివలీ ప్రాంతంలో మురికి కాలువ దగ్గర పడేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయమై పోలీసులు అతడిని ప్రశ్నించగా తనకు అందులో ఏమున్నాయో తెలియదని.. పాడైన పాతకాలం నాటి సామాన్లు అందులో ఉన్నాయని, వాటిని కండివలీ మురికి కాలువ దగ్గర పడేయాలని చెప్పి అక్కడి గిడ్డంగి దగ్గర ఓ వ్యక్తి తన ట్రక్కులో ఆ అట్టపెట్టెల్ని పెట్టాడని తెలిపాడు.
అయితే వికాస్ తరచుగా ఆ గిడ్డంగి దగ్గర నుంచి హేమా ఉపాధ్యాయ్ పెయింటింగ్స్ని వేరే ప్రాంతాలకు రవాణా చేస్తూ ఉండేవాడని తెలుస్తోంది. ప్రస్తుతం అరెస్టయిన ముగ్గురిలో ఇద్దరు మూడేళ్లుగా ఆ గిడ్డంగిలో పని చేసేవారే కావడం గమనార్హం.
అరెస్టైన నలుగురు నిందితులను పోలీసులు కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. అరెస్టైన వారిలో హేమా ఉపాధ్యాయ్ భర్త చింతన్ ఉపాధ్యాయ్ కూడా ఉన్నారు. అతడ్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న విద్యాధర్ రాజ్భర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
కాగా, 2013లో హేమ తన భర్త చింతన్పై కేసు పెట్టింది. మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. అంతేగాక, తన గదిలో అశ్లీల చిత్రాలు గీస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ సమయంలో హేమ తరపున న్యాయవాది హరీష్ ప్రాతినిధ్యం వహించాడు. కాగా, హేమా ఉపాధ్యాయ్ భర్త చింతన్ కూడా చిత్రకారుడే.