మంత్రికి కరోనా పాజిటివ్: హోమ్ క్వారంటైన్లో ముఖ్యమంత్రి: అధికారిక నివాసంలో సెల్ఫ్ ఐసొలేషన్
రాంచీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయాన్ని సృష్టిస్తోంది. వైరస్ తీవ్రత.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టట్లేదు. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత దేశంలో నమోదవుతోన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లోనే ఉంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటోన్న నియంత్రణా చర్యలు ఏ మాత్రం ఫలించట్లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల మంత్రులు, రాజకీయ ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు.
తాజాగా- జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హోమ్ క్వారంటైన్కు వెళ్లిపోయారు. రాజధాని రాంచీలోని అధికారిక నివాసంలో సెల్ప్ ఐసొలేషన్లో ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం- తనను కలిసిన మంత్రివర్గ సహచరుడు మిథిలేష్ ఠాకూర్కు కరోనా వైరస్ పాజిటివ్గా తేలడమే. మంగళవారం మిథిలేష్ ఠాకూర్ రాంచీలో ముఖ్యమంత్రిని కలిశారు. అక్కడే తన శాఖకు సంబంధించిన అంశాలపై సమీక్షను నిర్వహించారు.
నంతరం తన నియోజకవర్గానికి వెళ్లిన మిథిలేష్ ఠాకూర్.. అనారోగ్యానికి గురయ్యారు. దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి కరోనా వైరస్ లక్షణాలతో బాధపడ్డారు. ఆయనకు పరీక్షలను నిర్వహించగా పాజిటివ్గా తేలింది. ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తెలిసిన వెంటనే హేమంత్ సోరెన్ ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. వెంటనే ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. తన అధికారిక నివాసంలోనే ఐసొలేషన్లో ఉంటున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ అధికారులు.. హేమంత్ సోరెన్ శాంపిళ్లను సేకరించారు. వాటిని పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇంకా అందాల్సి ఉంది. కాగా.. జార్ఖండ్లో ప్రస్తుతం మూడువేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 22 మంది ఇప్పటిదాకా మరణించారు. 892 యాక్టివ్ కేసులు అక్కడ నమోదు అయ్యాయి. రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు జార్ఖండ్లో పెరుగుతున్నాయి.