జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం: రాహుల్, మమతా సహా నేతల హాజరు
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధినేత హేమంత్ సోరెన్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ పార్టీల ముఖ్య నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భగేల్, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Shri @RahulGandhi & senior Congress leaders attend Jharkhand govt swearing-in ceremony. pic.twitter.com/2BCI87lgdP
— Congress (@INCIndia) December 29, 2019
కాగా, హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రి. గతంలోనూ ఆయన సీఎంగా పనిచేశారు. 2013-14లో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైంది.
గత సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి దూసుకెళ్లింది. 81 అసెంబ్లీ స్థానాలు కలిగిన జార్ఖండ్లో జేఎంఎం-కాంగ్రెస్-జనతా దళ్(ఆర్జేడీ) కూటమి 47 స్థానాలను కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ కంటే ఐదు సీట్లను ఎక్కువగానే గెలుచుకుంది. బీజేపీ మాత్రం 25 సీట్లకే పరిమితమైంది.