విదేశాల్లో చిక్కుకుపోయారా.. లేదా అర్జెంటుగా విదేశాలకు వెళ్లాలా.. ఇదిగో ఎస్ఓపీ.. దీన్ని ఫాలో అవండి..
లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయి భారత్కు రావాలనుకుంటున్న విదేశీయుల కోసం.. అలాగే అత్యవసర పరిస్థితుల రీత్యా భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) విడుదల చేసింది. దీని ప్రకారం మే 7వ తేదీ నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాలు,నావల్ షిప్స్ ద్వారా భారత్కు తీసుకొస్తారు.
అయితే ఎస్ఓపీ ప్రోటోకాల్ ప్రకారం.. లాక్ డౌన్కు ముందు విద్య,ఉపాధి,ఇంటర్న్షిప్,టూరిజం,బిజినెస్ తదితర అవసరాల రీత్యా విదేశాలకు వెళ్లి.. లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన భారతీయులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే.. విదేశాల నుంచి భారత్కు రావడానికి అనుమతినిస్తారు. కేంద్రం జారీ చేసిన ఎస్ఓపీని ఒకసారి పరిశీలిద్దాం..
టాప్ ప్రియారిటీ ఎవరికి..
మీరు ఎక్కడైతే చిక్కుకుపోయారో ఆ దేశంలోని ఇండియన్ మిషన్స్ వద్ద మీ వివరాలు నమోదు చేయాలి. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే నాన్ షెడ్యూల్డ్ ప్యాసింజర్ ఫ్లైట్స్ ద్వారా లేదా నావల్ షిప్స్ ద్వారా వీరిని భారత్కు తరలిస్తారు. అయితే కరోనా వైద్య పరీక్షల్లో నెగటివ్గా తేలినవారిని మాత్రమే విమానాలు,షిప్స్లోకి అనుమతిస్తారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు,వలస కార్మికులు,ఉద్యోగాలు కోల్పోయినవారు,స్వల్ప కాల వీసా కలిగివున్నవారు,మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు,గర్భిణీ స్త్రీలు,వయసులో పెద్దవారు,విద్యార్థులు లేదా కుటుంబ సభ్యుల మృతి కారణంగా భారత్కు రావాలనుకునేవారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఖర్చును సొంతంగా భరించాల్సిందే..
విదేశాల నుంచి భారత్కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు మాత్రమే చేస్తుంది. అందుకు అయ్యే ఖర్చును మొత్తం అక్కడినుంచి వచ్చేవారే భరించాల్సి ఉంటుంది. ఇండియన్ మిషన్స్ సేకరించిన డేటా బేస్ ఆధారంగా విమానాల వారీగా,షిప్ల వారీగా ప్రయాణికుల జాబితాను విదేశీ వ్యవహారాల శాఖ రూపొందిస్తుంది. ఇందులో RT-PCR టెస్టుల పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇదే డేటా బేస్ను భారత్లోని సంబంధిత రాష్ట్రాలు,కేంద్రపాలిత రాష్ట్రాలకు పంపిస్తారు.
భారత్ వచ్చాక క్వారెంటైన్ తప్పనిసరి..
కనీసం రెండు రోజుల నోటీసుతో విదేశాల నుంచి వచ్చే విమానాలు లేదా షిప్ల వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ తమ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంచుతుంది. విదేశాల నుంచి భారత్కు తిరిగొచ్చేవారు.. ఇక్కడికొచ్చాక తమ సొంత ఖర్చులతో 14 రోజుల పాటు క్వారెంటైన్లో ఉండటం తప్పనిసరి. విమానం లేదా షిప్లోకి బోర్డింగ్ సమయంలో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తారు. కరోనా లక్షణాలేవీ లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి..
ప్రయాణికులు కచ్చితంగా తమ సెల్ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలి. భారత్ చేరుకున్న తర్వాత ఎవరికైతే కరోనా లక్షణాలు బయటపడితే వారికి వైద్యు సదుపాయం అందజేస్తారు. లక్షణాలు లేనివారిని క్వారెంటైన్కు తరలిస్తారు. కరోనా లక్షణాలు లేనివారికి 14 రోజుల క్వారెంటైన్ తర్వాత కూడా నెగటివ్ రిపోర్ట్ వస్తే ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే ఆ తర్వాత మరో 14 రోజుల పాటు ఆరోగ్యంపై స్వీయ పర్యవేక్షణ తప్పనిసరి.
భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోసం..
ఒకవేళ మీరు భారత్లో ఉండి.. ఉద్యోగ రీత్యా అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఈ గైడ్ లైన్స్ పాటించాలి. మీరు ఏ దేశానికైతే వెళ్లాలనుకుంటున్నారో.. ఆ దేశ పౌరసత్వం మీకు ఉంటేనే వెళ్లడానికి అనుమతిస్తారు. లేనిపక్షంలో మీరు కనీసం ఏడాది కాలం గడువుతో కూడిన వీసా హోల్డర్స్ లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్స్,ఓసీఐ కార్డ్ హోల్డర్స్ అయిన ఉండాలి.ఒకవేళ ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే.. లేదా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఆర్నెళ్ల వీసా పరిమితి ఉన్నవారిని కూడా అనుమతిస్తారు. ఇందుకోసం మీరు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ లేదా సంబంధిత శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. మే మొదటివారంలోనే ఎయిర్ ఇండియా విదేశాలకు ప్రత్యేక విమానాలు నడుపుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
సివిల్ ఏవియేషన్ నిర్దారణ తప్పనిసరి..
టికెట్ ఖరారుకు ముందు.. మీరు వెళ్లాలనుకున్న దేశం బయటి దేశాల నుంచి వచ్చేవారిని అనుమతిస్తుందో లేదో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నిర్దారించాల్సి ఉంటుంది. భారత్ నుంచి విదేశాలకు వెళ్లేవారు ఖర్చును సొంతంగా భరించాల్సి ఉంటుంది. బోర్డింగ్కి ముందు సివిల్ ఏవియేషన్ థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తుంది. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే విమానంలోకి అనుమతిస్తుంది. మాస్కులు ధరించడం,శానిటైజర్,పరిశుభ్రత,రెస్పిరేటరీ హైజీన్,తదితర నిబంధనలు పాటించడం తప్పనిసరి.