పార్టీలో మార్పును కోరుతూ సోనియాకు లేఖ రాసిన 23 మంది వీరే.. వారిలో ఒకరు రెండు సార్లు రాశారట..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావాలంటే పార్టీలో సమూలమైన మార్పులు తీసుకురావాలని కోరుతూ 23 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీకి లేఖ రాయడంతో ఆమె అధ్యక్షపదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని భావించింది. ఇదిలా ఉంటే ఈ లేఖ రాసేందుకు మూల కారణమైన ఓ సీనియర్ నేత గురించే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన సోనియాగాంధీకి ఇదివరకే రెండు లేఖలు పంపగా ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. లాక్డౌన్ సమయంలో పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ లేఖ రాశారు.
ఈ లేఖలపై ఎలాంటి సమాధానం ఇవ్వని సోనియాగాంధీ నేరుగా రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్న గులాం నబీ ఆజాద్తో మాట్లాడినట్లు సమాచారం. ఇది కూడా మూడో లేఖ అందిన తర్వాత సోనియా మాట్లాడినట్లు సమాచారం. ఈ మూడో లేఖలో గులాం నబీ ఆజాద్ కూడా మిగతా 22 మంది సీనియర్ నేతలతో పాటుగా సంతకం చేశారు. సంతకం చేసిన వారిలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, చాలామంది సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు, సిట్టింగ్ ఎంపీలు, ఇతర మాజీ కేంద్రమంత్రులు ఉన్నట్లు సమాచారం.లేఖలో ప్రస్తావించిన అంశాలపై తాను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అజాద్తో సోనియా ఫోన్లో చెప్పినట్లు సమాచారం.
అయితే తాము ప్రస్తావించిన అంశాలను పూర్తిస్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో చర్చించకుండా అందులోని కొందరు సీనియర్లతో మాత్రమే చర్చించాలని కోరినట్లు సమాచారం. వీరితో పాటు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లను కూడా చేర్చాలని వారు కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే లేఖ పైన స్పందించిన సోనియా గాంధీ తాను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే సోనియా నాయకత్వాన్ని తాము ఏనాడు ప్రశ్నించలేదని లేఖ రాసిన సీనియర్ నేతలు చెప్పినట్లు సమాచారం. 2004,2009లో పార్టీని ఏ రకంగా ఆమె పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో అన్నదానిపై తమకు తెలుసని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆమె అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని తిరిగి రాహుల్ గాంధీ పీటం ఎక్కాలని మరికొందరు భావిస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి లేఖ రాసిన 23 సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఐదు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. అందులో హర్యానా సీఎంగా పనిచేసిన భూపేందర్ సింగ్ హూడా ఉండగా పంజాబ్ ముఖ్యమంత్రిగా 1996లో పనిచేసిన రాజిందర్ కౌర్ భట్టల్ ఉన్నారు. ఇక కర్నాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీ రాజ్ చవాన్, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసని గులాం నబీ ఆజాద్లు ఉన్నారు. ఇక పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్,ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సీఎంలు భూపేష్ భగేల్, అశోక్ గెహ్లాట్, లోక్సభ ప్రతిపక్ష నేత రంజన్ చౌధురి, మాజీ కేంద్రమంత్రులు అశ్వనీ కుమార్, సల్మాన్ ఖుర్షీద్,కేకే తివారీలు సోనియాగాంధీకి మద్దతుగా గళం విప్పారు. ఇక పార్టీలో మార్పులు జరగాలని భావిస్తున్న వారిలో గులాంనబీ ఆజాద్,ఆనంద్ శర్మ, కపిల్ సిబాల్, ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీ, శశి థరూర్, మరియు మాజీ హర్యానా సీఎం భూపిందర్ సింగ్ హుడా ఉన్నారు.