నిర్మలమ్మ బడ్జెట్తో లబ్ధి పొందుతున్న ప్రైవేట్ సంస్థలు ఇవే..!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే భారం మోడీ సర్కార్పై ఉంది. గత 11 ఏళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదు. ఒకప్పుడు భారత దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండేదనే గుర్తింపు ఉండేది. అయితే ప్రస్తుతం మళ్లీ మొదటి నుంచి ఆర్థిక వ్యవస్థను నిర్మించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆదాయం పెంపు, ఆర్థిక వ్యవస్థ మూలాల బలోపేతం, విద్యుత్ కొనుగోలు పెంపుపైనే ప్రధానంగా తన బడ్జెట్ ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్తో సంస్థలు లాభపడుతున్నాయి.. లేదా లబ్ధి చేకూరుతున్నాయి..?
నేషనల్ హైవేస్
లార్సెట్ & టబ్రో సంస్థకు మేలు
నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ కొన్ని రంగాలకు మేలు చేసేలా ఉంటే మరికొన్ని రంగాలకు నష్టం చేకూర్చేలా ఉంది. ముందుగా మేలు చేస్తున్న రంగాల గురించి తెలుసుకుందాం.
* రవాణా రంగంలో మౌళికసదుపాయాలు:
భారత దేశంలో హైవేలు మరియు రైల్వేల అభివృద్ధికి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యూహాలను ఆవిష్కరించారు. తన బడ్జెట్లో వీటి నిర్మాణం అభివృద్ధికి,ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1.7 ట్రిలియన్ రూపాయలను ప్రతిపాదించారు. ఒకేసారి 12 హైవేలను ఆధునీకీకరణ చేయనున్నారు. దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలైన లార్సన్ & టబ్రో, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మరియు ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థలు లబ్ధి పొందే అవకాశం ఉంది.
* ఎలక్ట్రానిక్స్ మానుఫాక్చురింగ్
మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెమీకండక్టర్ ఉత్పత్తి, మెడికల్ డివైసెస్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్పత్తి సంస్థలు అయిన డిక్సాన్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, సబ్రోస్, సంస్థలు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
వ్యవసాయంకు పెద్ద పీట వేయడంతో లాభపడనున్న సంస్థలు
వ్యవసాయం మరియు గ్రామీణ ప్రాంత పరిశ్రమలకు రూ. 2.83 ట్రిలియన్ రూపాయలను నిర్మలా సీతారామన్ కేటాయింపులు చేశారు. వ్యవసాయ రంగంలో 15 ట్రిలియన్ రూపాయలు వచ్చే ఏడాదికల్లా రుణాలుగా ఇవ్వాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్లు చెప్పారు. అంతేకాదు మత్స్యకారం రంగాన్ని విస్తరించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా 500 ఫిష్ ఫార్మ్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తామని చెప్పారు.
దీంతో అవంతి ఫీడ్స్ అనే సంస్థ కు లాభం చేకూరనుంది. ఇక వ్యవసాయ పంటలను రవాణా చేసేందుకు ఎయిర్ కండీషన్ బోగీలను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంతో కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేలు చేకూరనుంది.ఈ ప్రకటనతో ఎఫ్ఎంసీజీ సూచీలు లాభాల బాట ర్యాలీ అయ్యాయి. ఇమామీ, హిందుస్తాన్ యూనీలీవర్, డాబర్, టాటా గ్లోబల్ సంస్థలు కూడా లాభాలబాట పయనించాయి.
నీటి రంగంకు నిర్మలా వరాలు.. లబ్ది పొందనున్న సంస్థలు
సరైన నీటి సదుపాయం లేని జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంతో వీఏ టెక్ వాబాగ్ లిమిటెడ్ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. ఈ సంస్థ నీరు మరియు మురుగునీరు శుద్ధి ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఇక రైతులకు సోలార్ పంపులను కేటాయిస్తామన్న ప్రకటనతో శక్తి పంప్స్ ఇండియా లిమిటెడ్ లాభాల బాట పట్టింది.
ఇక 2024కల్లా ప్రతి గృహానికి పైపు ద్వారా నీటిని అందిస్తామన్న ప్రకటనతో జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, కేఎస్బీ లిమిటెడ్, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, జేకే అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్, పీఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్లాంటి సంస్థలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇక క్లీన్ ఇండియా మిషన్ కోసం రూ.123 బిలియన్లు కేటాయించడంతో హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, గోద్రెజ్ సంస్థలు లాభాల బాట పట్టాయి.
బ్రాండ్ బ్యాండ్ ప్రకటనతో రిలయన్స్కు లబ్ధి
టెలికాం రంగంకు కూడా కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి గ్రామంకు ఇంటర్నెట్ సేవలందించాలని యోచిస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు రూ. 60 బిలియన్లు కేటాయించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు హెచ్ఎఫ్సీఎల్ సంస్థలు లబ్ధి పొందే అవకాశం ఉంది.
ఎన్ఐఐటీకి లబ్ధి
నిర్మలా సీతారామన్ బడ్జెట్లో విద్యకు తగిన ప్రాధాన్యత లభించింది. విద్యారంగంకు 2020-21కి రూ. 993 బిలియన్ కేటాయించారు. ఆన్లైన్ ద్వారా బోధన చేసే సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్స్లో తొలి 100 స్థానాల్లో ఉన్న విద్యాసంస్థలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇ:దులో ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఎంటీ ఎడ్యుకేర్ సంస్థలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
గ్యాస్ గ్రిడ్ విస్తరణ
నేషనల్ గ్యాస్ గ్రిడ్ను విస్తరించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న 16,200 కిలోమీటర్లను 27వేల కిలోమీటర్లుకు విస్తరించాలనే యోచనలో ఉంది. దీంతో పైప్లైన్ సప్లయ్ సంస్థలు వెల్స్పన్ కార్ప్, మహారాష్ట్ర సీమ్లెస్ లిమిటెడ్, రత్నమణి మెటల్స్ & ట్యూబ్స్ లిమిటెడ్, జిందాల్ సా, మ్యాన్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ సంస్థలు లబ్ధి పొందనున్నాయి. నేషనల్ గ్యాస్ గ్రిడ్ను విస్తరించాలని భావిస్తున్న నేపథ్యంలో ఐజీఎల్, ఎంజీఎల్, గుజరాత్ గ్యాస్ సంస్థలకు లబ్ధి చేకూరనుంది.