ఆత్మనిర్భర్ యూపీ రోజ్గార్... లాంచ్ చేసిన మోదీ... కీలక పాయింట్స్ ఇవే...
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(జూన్ 26) ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గారి అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ పథకం కింద ఉత్తరప్రదేశ్లోని 31 జిల్లాల్లో ఉన్న వలస కార్మికులకు ఏడాదిలో 125 రోజుల పాటు ఉపాధి లభించనుంది. ఇటీవల కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నగరాల నుంచి స్వస్థలాలకు వెళ్లిన వలస కూలీలు,కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపొందించారు. మరో ఆరు రాష్ట్రాల్లోనూ త్వరలో ఈ పథకం ప్రారంభం కానుంది.
ఇటు కరోనా..అటు చైనా.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న మోదీ.. డ్రాగన్ కు షాక్ తప్పదా?
యూపీలో 30లక్షల మందికి
తాజా పథకం ద్వారా ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 30లక్షల మంది వలస కార్మికులకు ఉపాధి లభించనుంది. వీరంతా ఇటీవల లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు,ఉపాధి కోల్పోయి గ్రామాల బాట పట్టినవారే. దేశవ్యాప్తంగా మొత్తం ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకం అమలుకానుంది. ఉద్యోగాల కల్పన,పరిశ్రమలు,ఇతరత్రా సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను ఈ పథకం ద్వారా చేపట్టనున్నట్టు కేంద్రం వెల్లడించింది.
యూపీ ప్రజలకు మోదీ సెల్యూట్...
పథకం లాంచ్ చేసిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... 'కరోనా సంక్షోభం సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు చూపిన ధైర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. ప్రపంచానికి మీరు ఆదర్శవంతంగా నిలిచారు. వైద్యులు,పారామెడికల్ స్టాఫ్,పోలీసులు,ఆశా వర్కర్స్,అంగన్ వాడీ వర్కర్స్,బ్యాంకు ఉద్యోగులు,పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రతీ శాఖకు చెందినవారు కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి తమవంతుగా కృషి చేస్తున్నారు.' అని చెప్పారు.
ఆ దేశాల కంటే యూపీ మెరుగ్గా...
' కరోనా నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్ చేస్తున్న కృషి చాలా గొప్పది. ఎందుకంటే ఇది కేవలం ఒక్క రాష్ట్రం మాత్రమే కాదు. ప్రపంచంలో ఎన్నో దేశాల కంటే పెద్ద రాష్ట్రం ఇది. ఫ్రాన్స్,ఇటలీ,స్పెయిన్,యూకె.. ఇలా వీటన్నింటి జనాభాను కలిపితే యూపీ జనాభాకు సమానమవుతుంది. ఈ దేశాల్లో ఇప్పటికే లక్ష పైచిలుకు మంది మృతి చెందారు. కానీ యూపీలో కేవలం 600 మంది మాత్రమే చనిపోయారు.' అని మోదీ పేర్కొన్నారు.దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను స్పూర్తిగా తీసుకుని సంక్షోభాన్ని కూడా అవకాశంగా మలుచుకోగలవని ఆశిస్తున్నట్టు మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలే గనుక ఇప్పుడు ఉండి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉండేదన్నారు.
Recommended Video
ఆదాయం పెంచేందుకు...
కేంద్రం తీసుకొచ్చిన గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం ద్వారా గ్రామాల్లో ఉపాధి కూలీల ఆదాయం పెరుగుతుందన్నారు. సూక్ష్మ,మధ్య తరహా పరిశ్రమల ద్వారా దాదాపు 60లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. అలాగే ముద్ర యోజనా కింద దేశవ్యాప్తంగా వేలాదిమంది ఎంట్రప్రెన్యూర్స్కి రూ.10వేల కోట్లు కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటికే 3లక్షల స్కిల్ లేబర్ను గుర్తించామన్నారు. నిర్మాణపరమైన రంగాల్లో వారి సేవలు ఉపయోగించుకుంటున్నామన్నారు. అలాగే డ్రైవర్లు,డొమెస్టిక్ క్లీనర్స్,టైలర్స్ ఇతరత్రా స్కిల్స్ కలిగినవారికి కూడా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.