ట్రెక్కింగ్ విషాదం, సజీవదహనం అయిన 9 మంది వీరే, మూడు హెలికాప్టర్లు, పళని, పన్నీర్ !
Recommended Video
చెన్నై: తమిళనాడు సాహసయాత్ర విషాదయాత్రగా మారింది. అడవిలో ట్రెక్కింగ్ కు వెళ్లిన 9 మంది విద్యార్థులు సజీవదహనం అయ్యారు. తమిళనాడు-కేరళ సరిహద్దులోని తేనీ జిల్లాలో బెడినాయకనూర్ సమీపంలోని కురంగని అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. మూడు హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
చెన్నై ట్రెక్కింగ్ క్లబ్
చెన్నై ట్రెక్కింగ్ క్లబ్ కు చెందిన 25 మంది యువతులు, 8 మంది పురుషులు, ఈరోడ్, తిరప్పూర్ కు చెందిన 13 మంది సభ్యులు తేనీ జిల్లాలోని కురంగని అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చెయ్యడానికి శనివారం మద్యాహ్నం వెళ్లారు.
ఒక్కసారిగా మంటలు
ఆదివారం సాయంత్రం కురంగని అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చెయ్యడానికి వెళ్లిన యువతులు వేసుకున్న గుడారాలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించారు. ఓ యువతి అటవి శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి తాము మంటల్లో చిక్కుకున్నామని, రక్షించాలని వేడుకుంది.
రంగంలోకి అధికారులు
తమిళనాడు తేనీ జిల్లా ఎస్పీ భాస్కరన్, అటవి శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి ప్రయత్నించారు. ఆదివారం రాత్రి చీకటిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ఎయిర్ ఫోర్స్
తమిళనాడు ప్రభుత్వం మనవి చెయ్యడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వాయుసేన అధికారులను రంగంలోకి దించారు. మూడు హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 15 మందిని క్షేమంగా రక్షించామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్టర్ లో తెలిపారు.
పన్నీర్, పళనిస్వామి
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇప్పటికే తేనీ జిల్లాలోని కురుంగని అటవీ ప్రాంతానికి చేరుకుని సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సోమవారం ఉదయం తేనీ జిల్లాకు బయలుదేరి వెళ్లారు.
రంగంలోకి కేరళ
తేనీ జిల్లా కురంగని అటవీ ప్రాంతంలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి కేరళ పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థులను రక్షించడానికి ప్రత్యేక బృందాలను తేనీ జిల్లాకు పంపించామని కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహ్రా మీడియాకు చెప్పారు.
సజీవదహనం అయ్యింది వీరే
చెన్నైకి చెందిన అఖిల, ప్రేమలత, పునిత, సుధ, అరుణ, విబణి, ఈరోడ్ కు చెందిన దివ్య, వివేక్, తమిళ సెల్వి సజీవదహనం అయ్యారని తేనీ జిల్లా అధికారులు గుర్తించారు. అటవి ప్రాంతంలో చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. పన్నీర్ సెల్వం, తేనీ జిల్లా కలెక్టర్ పల్లవి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.