మహిళలకు మందిరం, మసీదు ఒక్కటే..! శబరిమలపై తీర్పుపై బెంచ్ లో భేదాభిప్రాయాలు రావడానికి కారణం ఇదే..!
న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలోనికి మహిళలకు ప్రవేశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన రివ్యూ పిటీషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును పెండింగ్ లో ఉంచింది. ఈ కేసుపై విచారించిన అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న న్యాయమూర్తుల్లో భేదాభిప్రాయాలు వ్యక్తం కావడం వల్లే తీర్పును పెండింగ్ లో ఉంచింది. మహిళల ప్రవేశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రా వ్యతిరేకించగా.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నారీమన్ సానుకూలంగా స్పందించారు. మహిళలకు ప్రవేశం కల్పించాల్సి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. దీనితో తుది తీర్పును పెండింగ్ లో ఉంచారు. ఏడుమంది న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలనకు పంపించారు.
పెండింగ్లో శబరిమల తీర్పు: ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలనకు: బెంచ్లో భేదాభిప్రాయాలు
మందిరమైనా, మసీదు అయినా, పార్శీ ప్రార్థనా స్థలాలైనా..
ఈ ఉదయం సరిగ్గా 10:30 గంటలకు జస్టిస్ రంజన్ గొగొయ్ తీర్పు పాఠాన్ని చదవడం ఆరంభించారు. అయిదే అయిదు నిమిషాల్లో తీర్పు పాఠాన్ని పూర్తి చేస్తానని చెప్పారు. సర్వమత సమ్మేళనంగా భావించే భారత దేశంలో మహిళలకు సమాన హక్కులు, సమాన హోదా కల్పించడంలో భాగంగా అన్ని ఆలయాల్లో కూడా వారికి ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాల్సి ఉంటుందని రంజన్ గొగొయ్ అభిప్రాయపడ్డారు. మందిరం, మసీదులు, పార్శీలకు సంబంధించిన ప్రార్థనా ప్రదేశాల్లో కూడా మహిళలకు ప్రవేశాన్ని కల్పించాల్సి ఉంటుందని రంజన్ గొగొయ్ అన్నారు.
హిందువులు మాత్రమే ఇంప్లీడ్..
శబరిమలకు సంబంధించిన కేసు విషయంలో ఒక్క హిందువులు మాత్రమే ఇంప్లీడ్ అయ్యారని, మసీదుల్లో మహిళలకు ప్రవేశం కల్పించే విషయంలో ఆ మతానికి సంబంధించిన ప్రతినిధులు ఎవ్వరూ తమ అభిప్రాయాలు గానీ, వాదనలను గానీ వినిపించలేదని చెప్పారు. ముస్లింలు, పార్శీల అభిప్రాయాలు, వాదనలను ఆలకించకుండా.. అన్ని మతాల మహిళలకు వారి వారి మతపరమైన ప్రార్థనా స్థలాల్లో ప్రవేశాన్ని కల్పించలేమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. దీనితో ఆయా మతాల ప్రతినిధుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవడానికి వీలు కల్పిస్తూ.. తీర్పును పెండింగ్ లో ఉంచామని అన్నారు. ఏడుమంది న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలనకు పంపిస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో ముస్లింలు, పార్శీల అభిప్రాయాలను కూడా..
మహిళలకు ప్రవేశాన్ని కల్పించాల్సి వస్తే.. అది ఒక్క హిందూ ఆలయాలకు మాత్రమే పరిమితం కాకూడదని చెప్పారు. మసీదులు, పార్శీ ఆలయాల్లోనూ ఇదే సంప్రదాయాన్ని అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. ఈ దిశగా తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని న్యాయమూర్తులు స్పష్టం చేసిన నేపథ్యంలో.. ముస్లిం ప్రతినిధులు, పార్శీల సంఘాల వారు కూడా శబరిమల రివ్యూ పిటీషన్ లో ఇంప్లీడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మసీదుల్లో ముస్లిం మహిళలకు ప్రవేశాన్ని కల్పించాలా? వద్దా? అనే విషయంపై వారి వాదనలను కూడా సుప్రీంకోర్టు ఆలకించడం దాదాపు ఖాయమైనట్టేనని చెబుతున్నారు.
తీర్పునకు అనుకూలంగా ముగ్గురు.. ప్రతికూలంగా ఇద్దరు
శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడానికి అనుమతి ఇచ్చే విషయంలో అయిదుంది న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనంలో భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళలకు ప్రవేశాన్ని నిషేధించడానికి ముగ్గురు న్యాయమూర్తులు సమర్థించారు. మరో ఇద్దరు దీన్ని తిరస్కరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, ఖన్విల్కర్, ఇందు మల్హోత్రా మహిళల ప్రవేశానికి నిషేధించడానికి అనుకూలంగా ఉండగా.. జస్టిస్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్ వారికి ప్రవేశం కల్పించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ తీర్పును పెండింగ్ లో ఉంచారు.