రైల్లో ఎలుకలు తిరిగాయి...రూ.19వేలు చెల్లించండి
Recommended Video
రైలు కంపార్ట్ మెంట్లలో ఎలుకలు తిరుగుతున్నాయని, బోగీలు శుభ్రంగా లేవని వినియోగదారుల కోర్టులో ఓ మహిళా న్యాయవాది పిటిషన్ వేయడంతో ఆమెకు రూ. 19వేలు రైల్వే శాఖ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ప్రయాణికుల వద్ద ఛార్జీల రూపంలో డబ్బులు వసూలు చేసి... శుభ్రతను పాటించని రైల్వేశాఖపై కోర్టు మండిపడుతూ ప్రయాణికులకు జరిమానా కట్టాల్సిందేనంటూ ఆదేశించింది.
శీతల్ కనకియా అనే మహిళా న్యాయవాది ఆమె బంధువు హేమ కనకియాలు 2015 నవంబర్ 7న లోక్మాన్య తిలక్ టెర్మినల్ నుంచి దురంతోలో ప్రయాణించారు. అయితే ప్రయాణ సమయంలో బోగీలో ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. అంత పెద్ద రైలును శుభ్రం చేసేందుకు తమకు మూడుగంటల సమయం మాత్రమే ఉంటుందన్న నిర్లక్షపు సమాధానం ఇచ్చారు. దీంతో శీతల్ తన ప్రయాణం ముగిశాక, డిసెంబర్ 2, 2015లో కన్స్యూమర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాము ప్రయాణించిన దురంతో ఎక్స్ప్రెస్ బోగీలు పరిశుభ్రంగా లేవని... రైలులో అమ్మిన ఆహారం కూడా శుభ్రంగా లేదని దీంతో వారు ప్రయాణం మొత్తం అనారోగ్యంతోనే బాధపడినట్లు పేర్కొంది. టాయ్లెట్స్ కూడా క్లీన్గా లేవంటూ ఫిర్యాదు చేయడమే కాదు.. తామంతా నరకాన్ని అనుభవించినట్లు పిటిషన్లో తెలిపింది.
తాము టికెట్లను రూ.6600తో కొనుగోలు చేశామని అది వెనక్కు తిరిగి ఇవ్వడంతో పాటు మానసిక వ్యధను అనుభవించినందుకు గాను పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ కోర్టును కోరారు. దీనికి సంబంధించి వారు ప్రయాణించిన టికెట్లు, అనారోగ్యంతో బాధపడిన సమయంలో వారు సంప్రదించిన డాక్టరు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ జతచేర్చి దాఖలు చేశారు. అయితే శీతల్ ఆరోపణలు అవాస్తవమని రైల్వేశాఖ తెలిపింది. అవాస్తవమని చెప్పేందుకు రైల్వేశాఖ దగ్గర ఎలాంటి రుజువులు లేకపోవడం.. జడ్జీలు నమ్మేందుకు ఎలాంటి సాక్షాధారాలు లేకపోవడంతో రైల్వేశాఖ శీతల్కు కూ.19వేలు పరిహారంగా చెల్లించాల్సిందేనంటూ ఆదేశించింది.