వైఎస్ జగన్ వైఖరేంటీ?: రైతుల పక్షమా? బీజేపీకి అనుకూలమా? బీజేపీయేతర పార్టీలన్నీ!
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించి మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా గురువారం రైతులు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్కు క్రమంగా మద్దతు పెరుగుతోంది. భారత్ బంద్ మరింత బలోపేతమౌతోంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలు మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్కు మద్దతు ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి వంటి తటస్థ పార్టీలు భారత్ బంద్కు మద్దతును తెలిపుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తిమోర్చా ఈ జాబితాలో చేరాయి.
మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా..
ఇదివరకటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే. మార్కెట్ యార్డుల వ్యవస్థను రద్దు చేసేలా ఉన్న ఈ బిల్లుల్లోని కొన్ని వివాదాస్పద ప్రతిపాదనలు, అంశాల పట్ల దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారు. ప్రత్యేెకించి- పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీని ముట్టడించారు. దేశ రాజధానిలోకి ప్రవేశించడానికి అన్ని మార్గాలనూ మూసివేయడంతో కొన్ని రోజులుగా వారు శివార్లలో గడుపుతున్నారు. వణికించే చలినిసైతం వారు లెక్కచేయట్లేదు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో..
రైతుల ప్రతినిధులతో కేంద్రం నిర్వహిస్తోన్న చర్చలు కొలిక్కి రావట్లేదు. ఇప్పటికే ఎనిమిది దశల్లో చర్చలు ముగిశాయి. కేంద్రం దిగిరాకపోవడంతో రైతులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీనికి వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. భారత్ బంద్కు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారత్ బంద్ను విజయవంతం చేస్తామని వెల్లడించారు. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, భూపేష్ బఘెల్, అశోక్ గెహ్లాట్ మద్దతు ఇస్తున్నారు.
కాంగ్రెసేతర పార్టీల ప్రభుత్వాలు కూడా..
తాజాగా ఈ జాబితాలో మహారాష్ట్ర, జార్ఖండ్ చేరాయి. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉద్దవ్ థాకరే, హేమంత్ సోరెన్.. భారత్ బంద్కు మద్దతు తెలిపాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో అధికారంలో ఉన్న కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ పార్టీ) భారత్ బంద్లో పాల్గొంటామని తెలిపాయి. తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులు కేసీఆర్, పినరయి విజయన్ ఇప్పటికే దీనిపై తన వైఖరిని స్పష్టం చేశారు. బంద్కు సహకరిస్తామని వెల్లడించారు. కమ్యూనిస్టు పార్టీలతోపాటు బిహార్లో ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) బంద్లో పాల్గొనబోతోన్నారు.
Recommended Video
తేల్చని వైఎస్ జగన్..
దేశంలో తటస్థ పార్టీగా గుర్తింపు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇంకా తన వైఖరిని వెల్లడించట్లేదు. బంద్లో పాల్గొనేదీ లేనిదీ స్పష్టం చేయట్లేదు. ఈ మూడు వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా పార్లమెంట్లో ఓటు వేసినందున.. బంద్లో పాల్గొనడం అనుమానమే. బంద్కు మద్దతు ఇచ్చేది కష్టసాధ్యమే. బీజేపీకి చేరువ కావడానికి చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా భారత్ బంద్ను వ్యతిరేకించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన నిలుస్తారా? లేదా? అనేది దీనితో తేలిపోతుంది. మరో తటస్థ పార్టీ బిజూ జనతాదళ్ కూడా తన అభిప్రాయాన్ని ఇంకా వెల్లడించలేదు.