గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టగానే తన తల్లి చెప్పిన మాటలు ఇవే
మధ్య ప్రదేశ్లో గతేడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వారు మోడీ తల్లి హీరాబెన్ పేరును ప్రస్తావించారు. మోడీ తల్లి హీరాబెన్ వయస్సుతో పాటే రూపాయి విలువ కూడా పతనమవుతోందనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాజ్బబ్బర్. అయితే తన తల్లి గొప్పతనం ఏమిటో తనకు తెలుసని మోడీ తెలిపారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన చివరి దఫా ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టగానే తన తల్లి చెప్పిన మాటలు ఇవే
చాలా ఇబ్బందులు, కష్టాలకోర్చి కుటుంబంలోని పిల్లలందరిని పెంచి పెద్ద చేసిందని చెప్పారు ప్రధాని మోడీ. అయితే ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో పెద్దగా పట్టించుకోని తల్లి హీరాబెన్... ప్రధాని అయ్యాక మాత్రం దేశాన్ని నడింపిచగల సత్తా ఉన్న నాయకుడిగా తన కొడుకును చూసుకొంది. అయితే ప్రధాని అవ్వడంలో తన తల్లి పాత్ర పెద్దగా లేదని వర్ణించిన మోడీ... అంతకంటే ముందే తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశానని అదే తనను ప్రధాని స్థాయికి ఎదిగేలా చేసిందని చెప్పారు.
" దేశానికి ప్రధాని అయ్యాక తల్లి హీరాబెన్ ఎలా ఫీలయ్యారు అని చాలామంది నన్ను అడిగారు. కానీ అప్పటికే మోడీ అనే పేరు దేశం మొత్తం వ్యాపించింది. తన ఫోటోలు చాలా ప్రింట్ అయ్యాయి. దేశం చాలా ఉత్సాహంగా ఎదురు చూసింది అయితే నేను గుజరాత్ సీఎంగా అయినప్పుడు మాత్రమే ఆమె చాలా ప్రత్యేకంగా భావించారు. చాలా సంతోషపడ్డారు."
గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పేరు ప్రతిపాదించి ఖరారు చేసినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నట్లు గుర్తుచేసుకున్న మోడీ... వెంటనే అహ్మదాబాదుకు బయలుదేరినట్లు చెప్పారు. ప్రమాణస్వీకారానికి ముందు తన తల్లి దీవెనలు తీసుకునేందుకు అహ్మదాబాదుకు వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో మోడీకి తన తల్లి హీరాబెన్ చేసిన సూచనలు ఇచ్చిన సలహాలు తన జీవితంలో మంచి ప్రభావం చూపాయని చెప్పారు.
"గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం నా పేరును ప్రతిపాదించిన సమయంలో నేను ఢిల్లీలో ఉన్నాను. ప్రమాణస్వీకారానికి ముందు నా తల్లిని కలిసేందుకు అహ్మదాబాదుకు వెళ్లాను. ఆమె నా సోదరుడితో ఉంటుంది. అప్పటికే తన పేరును ముఖ్యమంత్రిగా ప్రకటించారన్న విషయం తెలిసింది. అయితే నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి పోస్టు అంటే ఏమిటో ఆమెకు తెలియదనే అనుకున్నా. అహ్మదాబాదులోని నివాసం వద్దకు చేరుకోగానే... అప్పటికే పండగవాతావరణం నెలకొంది. వేడుకలు ప్రారంభమయ్యాయి."
ఇక ఇంటికి దగ్గర నుంచే తన కొడుకు పనిచేస్తాడన్న ఆనందం ఆమెలో స్పష్టంగా కనిపించిందని మోడీ చెప్పారు. అధికారం వచ్చింది కదా అని లంచాలు తీసుకోరాదన్న మాటలు ఇంకా గుర్తున్నాయని చెప్పారు ప్రధాని మోడీ
"ఆ మాటలు చెప్పిన తర్వాత... ఇలా చూడు నువ్వేమి చేస్తావో ఎలాంటి పని చేస్తావో నాకు తెలియదు కానీ... లంచాల జోలికి మాత్రం వెళ్లకు.. అలాంటి పాపం చేయనని నాకు మాటివ్వు. నాతల్లి అన్న మాటలు నన్ను నిజంగానే ప్రభావితం చేశాయి. అది ఎలాగో చెబుతాను. తన జీవితమంత ఓ పేదరాలిగానే తన తల్లి కాలం వెల్లదీసింది. కట్టుకునేందుకు సరైన బట్టలు కూడా లేవు. ఇక పదవి వచ్చిందికదా అని లంచాలకు అలవాటు పడొద్దు..లంచాలను తీసుకోవద్దు" అనే తల్లి మాటలను గుర్తుచేసుకున్నాడు మోడీ.
తన తల్లి మాటలే తనకు స్ఫూర్తిగా నిలిచాయని చెప్పిన మోడీ... సీఎంగానే కాదు... ప్రధాని అయ్యాక కూడా ఆ మాటలు ఇంకా తనలో నాటుకుని ఉన్నాయని అందుకే ఇప్పటికీ తాను దృఢంగా ఉన్నట్లు వెల్లడించారు.
హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన నాల్గవ విడత ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. గత మూడు ఇంటర్వ్యూలు మోడీ బాల్యం నుంచి యుక్తవయస్సు వరకు జరిగిన ఘటనల గురించి చెప్పారు. ఒక సామాన్య వ్యక్తి నుంచి ఓ దేశానికి ప్రధానిగా ఎదిగిన విధానం గురించి మోడీ మాట్లాడటం జరిగింది.