మన కూతుళ్లకు తప్పకుండా న్యాయం: ఉన్నావ్-కథువా రేప్ ఘటనలపై మోడీ, కాంగ్రెస్పై ఫైర్
న్యూఢిల్లీ: ఉన్నావ్, కథువా అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. అత్యాచార ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన డాక్టర్ అంబేడ్కర్ స్మారక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయని కానీ అవి ప్రజలకు ఏం చేశాయని నిలదీశారు. ఈ స్మారక కేంద్రం అంబేడ్కర్కు నివాళి అన్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఏం చేశారన్నారు. అంబేడ్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు. అంబేడ్కర్ వారసత్వాన్ని దెబ్బతీసిందన్నారు.
వాజపేయి ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైలును క్లోజ్ చేసిందని, 2014లో తిరిగి తాము అధికారంలోకి వచ్చాక ఇందుకోసం పని చేశామని చెప్పారు. లట్కానా, అట్కానా, భట్కానా సంస్కృతి ఉన్న వారు అధికారంలోకి వస్తారని అంబేడ్కర్ అప్పుడు ఊహించలేదన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా పెండింగులో ఉన్న పనులను, కార్యక్రమాలను తాము ఈ నాలుగేళ్లలో తెరపైకి తీసుకు వచ్చామని చెప్పారు. దళితులపై అట్రాసిటీకి సంబంధించిన చట్టాన్ని 2015లో మరింత బలోపేతం చేశామన్నారు. కేసులను కూడా మెరుగు చేశామన్నారు.
భారత దేశ చరిత్ర నుంచి అంబేడ్కర్ను తప్పించేందుకు కాంగ్రెస్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుందని దుయ్యబట్టారు. అంబేడ్కర్ బతికి ఉన్నప్పుడే అందుకు పెద్ద ఉదాహరణ ఉందన్నారు. ఆయనను అవమానించేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుందన్నారు. నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నానని, అంబేడ్కర్కు గుర్తింపునిచ్చేలా ఆ పార్టీ ఏమైనా చేసిందా చెప్పాలని అడిగారు.
గత రెండు రోజులుగా దేని గురించి అయితే చర్చ జరుగుతుందో అవి జరగకూడనివి అని అత్యాచార ఘటనలను ఉద్దేశించి మోడీ అన్నారు. వీటిని చూసి సిగ్గుపడాలన్నారు. నేను ఈ హామీ ఇస్తున్నానని, అత్యాచారాలకు పాల్పడిన వారిని ఎత్తి పరిస్థితుల్లోను వదిలేది లేదన్నారు. కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. మన కూతుళ్లు తప్పకుండా న్యాయం పొందుతారన్నారు.