అక్కడ బీజేపీ ప్రెస్మీట్కు హెల్మెట్లతో వచ్చిన జర్నలిస్టులు: కారణం ఇదే
నయారాయపూర్: సాధారణంగా జర్నలిస్టులు ప్రెస్ మీట్ల వంటి కార్యక్రమాలకు చేతిలో మైకు, కెమెరాలు, పెన్నులు, పుస్తకం వంటి వాటితో వెళ్తారు. అయితే ఛత్తీస్గఢ్లో మాత్రం జర్నలిస్టులు వీటికి తోడుగా తలకు హెల్మెట్ కూడా పెట్టుకొని వస్తున్నారు. అయితే ఇది అన్ని పార్టీల కార్యక్రమాలకు కాదు. కేవలం బీజేపీ ప్రెస్మీట్లకు మాత్రమేనట.
గతవారం బీజేపీ మద్దతుదారులు ఒకరు రిపోర్టర్ పైన దాడి చేశాడు. దీంతో బుధవారం రిపోర్టర్లు హెల్మెట్తో వచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ... స్థానిక బీజేపీ నేతల తీరును నిరసన ద్వారా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నామని, అలాగే మళ్లీ వారు దాడి చేసినా తమకు రక్షణగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
జర్నలిస్ట్పై దాడి
గత శనివారం నాడు జర్నలిస్టు సుమన్ పాండే పైన బీజేపీ మద్దతుదారు ఒకరు దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. డిజిటల్ న్యూస్ పోర్టల్ ది వాయిసెస్కు పని చేస్తున్న సుమన్ పాండే పైన రాయ్పూర్లో బీజేపీ మద్దతుదారులు దాడి చేశారు. దీంతో పాండే తలకు గాయాలయ్యాయి. అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి రాయ్పూర్ బీజేపీ చీఫ్ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
వీడియో తొలగించమన్నారు.. తిరస్కరించా.. దాడి చేశారు
దీనిపై సుమన్ పాండే మాట్లాడుతూ.. తాను బీజేపీ సమావేశాన్ని వీడియో తీస్తుండగా హఠాత్తుగా బీజేపీ వారు దాడి చేశారని చెప్పారు. తాను వీడియో తీస్తుండగా రాజీవ్ అగర్వాల్ మరో వ్యక్తి త్రివేది వచ్చి ఆ వీడియోను తొలగించమని చెప్పారని, కానీ తాను తిరస్కరించానని, దీంతో తనపై దాడి చేశారన్నారు. వారు బలవంతంగా వీడియో తొలగించారని చెప్పారు. ఆ తర్వాత బయటకు వచ్చి తాను ఇతర జర్నలిస్టులకు విషయాన్ని చెప్పానని అన్నారు.
సారీ చెప్పాం.. అయినా అది అంతర్గత సమావేశం
దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సచ్చిదానంద ఉపాసనే మాట్లాడుతూ... ఈ ఘటనపై తాము పాండేకు క్షమాపణ చెప్పామన్నారు. అయినా అది తమ అంతర్గత సమావేశమని (క్లోజ్డ్ డోర్ మీటింగ్), ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గురించి చర్చించుకుంటున్నామని, అందుకే అతనిని సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పామని, అలాగే అంతకుముందు తీసిన వీడియోను తొలగించమని కోరామని, దానికి ఆయన నో చెప్పారన్నారు. పార్టీ నేతలు, వర్కర్స్ను కూడా మొబైల్స్ ఆఫ్ చేయమని చెప్పామని గుర్తు చేశారు.