సొంతింట్లో నిద్రిస్తే కీడు అని మంత్రి రోజు 350కి.మీ. ప్రయాణం, ఏం చెప్పారంటే?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణ దురదృష్టం బారినపడకుండా ప్రతి రోజు పెద్ద సాహసమే చేస్తున్నారు. తన నియోజకవర్గంలోని హోలెనరసిపుర నుంచి బెంగళూరుకు ప్రతిరోజు 350 కిలోమీటర్ల మేర వచ్చి వెళ్తున్నారు. దీనిపై ఓ ప్రచారం సాగింది.
బెంగళూరులో ప్రభుత్వం తనకు కేటాయించిన అధికారిక నివాసంలో తప్ప మరే ఇంట్లోను ఆయన నిద్రపోకూడదని జ్యోతిష్యులు చెప్పడం వల్లే రేవణ్ణ ఇంత దూరం ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు. రేవణ్ణకు జ్యోతిష్యంపై ఎంతో నమ్మకం.
జ్యోతిష్యులు చెప్పారని
ఈ నేపథ్యంలో ఆయన బెంగళూరులోని తన సొంత నివాసంలో లేదా ఇతర నివాసాల్లో ఉంటే దురదృష్టం తన్నుకొస్తుందని జ్యోతిష్యులు చెప్పారట. ప్రభుత్వం ఇచ్చే అధికారిక నివాసంలోనే ఉండాలని సూచించారట. రేవణ్ణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయాన్ని బట్టి జ్యోతిష్యులు ఈ లెక్కలు కట్టారట. దీంతో అధికారిక నివాసం ఇంకా లేకపోవడంతో దురదృష్టం వెంటాడుతుందని అంత దూరం ప్రయాణిస్తున్నారట.
సుదూర ప్రయాణం
బెంగళూరులో సొంత ఇళ్లు ఉన్నప్పటికీ ఆయన తన సొంత నియోజకవర్గంలోని హోలెనరసిపురంకు వెళ్లి నిద్రిస్తున్నారు. అక్కడ ఉదయం అయిదు గంటలకు నిద్రలేచి, పూజలు పూర్తయ్యాక నియోజకవర్గ ప్రజలు, నేతలతో కాసేపు మాట్లాడుతారు. ఎనిమిది గంటలకు బయలుదేరి పదకొండున్నర గంటలకు బెంగళూరు చేరుకుంటారు. మళ్లీ రాత్రి బయలుదేరి అర్ధరాత్రి సమయానికి హోళెనరసిపురం చేరుకుంటారు.
బంగ్లా కేటాయించారు కానీ
వాస్తవానికి బెంగళూరు, కుమార పార్క్ వెస్ట్ ప్రాంతంలో రేవణ్ణ కోరుకున్న లక్కీ బంగళాను ప్రభుత్వం కేటాయించింది. కానీ అందులో మాజీ మంత్రి మహదేవప్ప గత అయిదేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఆయన ఖాళీ చేయడానికి మరో మూడు నెలలు పడుతుందట. ఆ బంగళా కోసం ఆయన వేచి చూస్తున్నారు.
రేవణ్ణ స్పందన
కాగా, జ్యోతిష్యుల సూచన మేరకే ఇలా ప్రయాణిస్తున్నారా అని రేవణ్ణను అడిగితే.. తనకు ఇంకా ఇల్లు ఇవ్వలేదని, అందుకే ఇలా ప్రయాణించాల్సి వస్తోందని, అంతేతప్ప జ్యోతిష్యులెవరూ తనకు ఇలా చేయమని చెప్పలేదన్నారు. తనకు అధికారిక నివాసం కేటాయించే వరకు ఈ ప్రయాణం తప్పదన్నారు.