కేబీసీ: రూ.7 కోట్ల ప్రశ్నకు జవాబు చెప్పింది కానీ కోటితో సరిపెట్టుకుంది! ఆమెది కన్నీటిగాథ
న్యూఢిల్లీ: కౌన్ బనేగా కరోడ్పతి 10వ సీజన్లో అసోం రాష్ట్రం గౌహతికి చెందిన బినితా జైన్ రూ.1 కోటి గెలుచుకున్నారు. ఆమె రూ.7 కోట్ల ప్రశ్నకు సరైన సమధానమే చెప్పారు కానీ, అంతకుముందే, ఆమె విత్ డ్రా అయ్యారు. దీంతో ఆమె ఊహించిన సమాధానం సరైనదే అయినప్పటికీ రూ.1 కోటితో వెనక్కి తిరిగారు.
బినితా జైన్ రూ.7 కోట్ల ప్రశ్నకు సరైన సమాధానం చెబుతారా అని అందరూ ఆసక్తి కనబరిచారు. ఈ సీజన్లో రూ.కోటి గెలుచుకున్న మొదటి పోటీదారుగా నిలిచిన ఆమె, ఆ తర్వాత ప్రశ్నకు సరైన సమాధానం చెబితే రూ.ఏడు కోట్లు గెలుచుకునే అవకాశం ఉంది. చెప్పలేకుంటే ఆ డబ్బూ పోతుంది.
1867లో మొదటి స్టాక్ టికెట్ను ఎవరు కనుగొన్నారు? అని రూ.7 కోట్ల ప్రశ్నను కేబీసీ 10 వ్యాఖ్యాత అమితాబ్ బచ్చన్ అడిగారు. ఆ ప్రశ్నకు ఆమెకు సమాధానం తెలుసు. కానీ తన జవాబు సరైనదో కాదో అనే చిన్న అనుమానంతో ఆమె డ్రాప్ అయ్యారు. తాను రూ.1 కోటితో వైదొలగుతానని చెప్పారు.
ఆమె డ్రాప్ అయిన తర్వాత కూడా, మీకు తెలిసిన సమాధానం చెప్పమని అడుగుతారు. ఆమె చెప్పిన సమాధానం సరైనదే. కానీ అంతకుముందే వైదొలగడంతో ఆమె రూ.7 కోట్లు గెలవలేకపోయారు. ఆమె రూ.కోటితో పాటు ఓ కారు కూడా గెలుచుకున్నారు.
కాగా, బినితా మాట్లాడుతూ... తనకు ఇద్దరు పిల్లలని, పదిహేనేళ్ల క్రితం తన భర్త బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్తే ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని, ఆయన కోసం వేచి చూసి ఆ తర్వాత ట్యూషన్లు చెప్పానని, కొన్నాళ్లకు తన భర్తను ఉగ్రవాదులు చంపేశారని చెప్పారు. కానీ ఆయన బతికే ఉన్నాడనే చిన్న ఆశ ఉందన్నారు. ఆమె తన జీవిత గాథ చెబుతున్నప్పుడు అందరూ కంటతడి పెట్టుకున్నారు.