న్యూస్ పేపర్స్తో జాగ్రత్త : అలా ఉపయోగించారంటే.. అంతే సంగతి!
చెన్నై : రోడ్డు పక్కన ఆయిల్ ఫుడ్ తింటున్నారా! అదే ఫుడ్ ను న్యూస్ పేపర్ లో పార్సిల్ తీసుకెళ్తున్నారా! తిన్నాక అదే పేపర్ తో చేతులు తుడుచుకుంటున్నారా! అయితే లేని రోగాన్ని మీరు కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటారా! న్యూస్ పేపర్ పై ఉండే గ్రాఫైట్ మీ శరీరంలోకి వెళ్లి లేని అనారోగ్యాన్ని కలగజేసే ప్రమాదముందంటున్నారు శాస్త్రవేత్తలు.
పేపర్ ప్రింట్ కు ఉపయోగించే ఇంకులో గ్రాఫైట్ ను ఉపయోగిస్తారు. పత్రిక పొడిగా ఉన్నంతసేపు దానితో ప్రమాదమేమి ఉండదు. ఎప్పుడైతే పత్రిక తడి బారిన పడుతుందో.. అందులోని గ్రాఫైట్ ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఇళ్లల్లో ఏవైనా ఆయిల్ ఫుడ్స్ చేసినప్పుడు.. వాటినుంచి నూనె పీల్చివేయడానికి న్యూస్ పేపర్స్ ను ఉపయోగించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
అలా న్యూస్ పేపర్ ఉపయోగించడం ద్వారా.. ఆ ఆహార పదార్థాలు తింటున్నప్పుడు గ్రాఫైట్ శరీరంలోకి చేరిపోయి ఏకంగా కిడ్నీలు, కాలేయం చెడిపోయే ప్రమాదం ఉంది. గ్రాఫైట్ ఎంత ప్రమాదకరమంటే.. కణాలు, ఎముకల ఎదుగుదలను అది నిరోధిస్తుంటుంది. శరీరంలో పేరుకుపోయే విషపదార్థాలేవైనా సరే మల విసర్జన ద్వారా బయటకి వెళ్తాయన్న విషయం తెలిసిందే. అయితే గ్రాఫైట్ విషయంలో మాత్రం పరిస్థితి వేరు. శరీరంలో ఎక్కడిక్కడ పేరుకుపోయి.. తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుంది. కాబట్టి.. ఇకనుంచి న్యూస్ పేపర్ ను చదవడానికి తప్పించి.. ఇలా వంటింటి పనులకు ఉపయోగించకుండా ఉంటే మంచిది.