బాబుకు జయ లేఖ: చెన్నైలో హెరిటేజ్ ఫుడ్స్పై దాడి (పిక్చర్స్)
చెన్నై: చిత్తూరు జిల్లా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళుల మృతికి తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు పలువురు గుర్తు తెలియని వ్యక్తులు మైలాపూర్లోని హెరిటేజ్ సూపర్ మార్కెట్ పైన దాడి చేశారు. ఇది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చెందిన సంస్థ. దీంతో హెరిటేజ్ ఫుడ్స్ పైన దాడి చేశారు.
ఇద్దరు వ్యక్తులు బైక్ పైన హెరిటేజ్ సూపర్ మార్కెట్ వద్దకు వచ్చారు. ఆ సమయంలో పదిమంది స్టాఫ్, పలువురు కస్టమర్లు ఉన్నారు. వారు సైన్ బోర్డును పగులగొట్టారు. సూపర్ మార్కెట్లోకి వచ్చారు. రిజిస్టర్, కంప్యూటర్స్ తదితరాలను పగుల గొట్టారు. వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానికంగా ఉన్న పలువురు చిన్నారులతో.. ఈ స్టోర్ను పగుల గొట్టండి అని సూచించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మృతదేహాలతో ధర్నా
శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన 20మంది ఎర్రచందనం కూలీల్లోని ఇద్దరు కూలీల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు గురువారం రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగడంతో తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శశికుమార్, మురుగన్ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు.
తమకు న్యాయం జరిపించాలని, నష్టపరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ అప్పటి వరకు అంత్యక్రియలు జరుపబోమని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక దశలో వారికి, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మద్రాసు హైకోర్టులో కొంతమంది న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
సంఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, కేసులో చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా చేర్చాలని వారు డిమాండ్ చేశారు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు ఒక బస్సులో వెళ్తున్న ఏడుగురు కూలీలను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, మంగళవారం నాటి ఎన్కౌంటర్లో వారు చనిపోయినట్లు ప్రకటించారనే ప్రచారం తమిళనాడులో జోరుగా సాగుతోంది.
శేషాచలం ఎన్కౌంటర్పై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సందేహం వ్యక్తం చేశారు. ఈ ఎన్కౌంటర్ అసలుదా? బూటకపుదా? అనే నిజాన్ని నిర్ధారించడానికి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున పరిహారాన్ని ఆమె ప్రకటించారు.
హెరిటేజ్ ఫుడ్స్
చిత్తూరు జిల్లా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళుల మృతికి తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి.
హెరిటేజ్ ఫుడ్స్
గురువారం నాడు ఇద్దరు వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు మైలాపూర్లోని హెరిటేజ్ సూపర్ మార్కెట్ పైన దాడి చేశారు.
హెరిటేజ్ ఫుడ్స్
ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెందిన సంస్థ. దీంతో హెరిటేజ్ ఫుడ్స్ పైన దాడి చేశారు.
జయలలిత
ఈ ఎన్కౌంటర్ అసలుదా? బూటకపుదా? అనే నిజాన్ని నిర్ధారించడానికి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చంద్రబాబును జయలలిత డిమాండ్ చేశారు.