రూ. 1500 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్, అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్ట్: ఎక్కడంటే..?
న్యూఢిల్లీ: లక్షద్వీప్ తీరంలో రూ. 1,526 కోట్ల విలువైన 218 కిలోల హెరాయిన్ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాను ఇండియన్ కోస్ట్ గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అరెస్టు చేశారు. ఆపరేషన్ ఖోజ్బీన్ అనే సంకేతనామంతో లక్షద్వీప్లోని అగట్టి తీరంలో ఏజెన్సీలు ఈ ఆపరేషన్ను చేపట్టాయి.
"ప్రిన్స్", "లిటిల్ జీసస్" అనే రెండు ఫిషింగ్ బోట్ల నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది.
తమిళనాడు తీరం నుంచి రెండు భారతీయ పడవలు ప్రయాణిస్తాయని, మే రెండు లేదా మూడో వారంలో అరేబియా సముద్రంలో ఎక్కడో ఒకచోట పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు లభిస్తాయని నిఘా సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు డీఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది.
చాలా రోజుల శోధన, పర్యవేక్షణ తర్వాత, రెండు అనుమానిత పడవలు 'ప్రిన్స్', 'పొలిటిల్ జీసస్' భారతదేశం వైపు కదులుతున్నట్లు గుర్తించబడ్డాయి. ఈ రెండు పడవలను మే 18న లక్షద్వీప్ దీవుల తీరంలో కోస్ట్ గార్డ్, డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు.
అనంతరం రెండు పడవలను కొచ్చిలోని కోస్ట్గార్డ్ జిల్లా హెడ్క్వార్టర్స్కు తీసుకురాగా ఒక్కొక్కటి కిలో బరువున్న 218 హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనేక ఇతర ప్రదేశాలలో సోదాలు, తదుపరి విచారణ కొనసాగుతున్నాయని ప్రకటన పేర్కొంది.
"ఈ ఆపరేషన్ను డిఆర్ఐ. ఐసిజి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి అమలు చేశాయి. చాలా రోజుల పాటు రఫ్గా ఉన్న సముద్రాలలో విస్తృతమైన నిఘా ఏర్పాటు చేసింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్ హై-గ్రేడ్ హెరాయిన్గా కనిపిస్తుంది. అంతర్జాతీయ అక్రమ మార్కెట్లో దాని విలువ అంచనా వేయబడింది. దాదాపు రూ. 1,526 కోట్లు ఉంటుంది' అని ప్రకటనలో పేర్కొంది.
గత ఒక నెలలో డీఆర్ఐ ద్వారా పట్టుబడినవాటిలో ఇది నాల్గవ అతిపెద్ద డ్రగ్స్ రవాణా. ఏప్రిల్ 30న కాండ్లా ఓడరేవులో జిప్సం పౌడర్ వాణిజ్య దిగుమతి సరుకు నుంచి 205.6 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది డీఆర్ఐ. ఏప్రిల్ 29న పిపావావ్ ఓడరేవులో హెరాయిన్ కలిపిన 396 కిలోల నూలు, మే 10న న్యూఢిల్లీలోని ఐజీఐ ఎయిర్పోర్టు ఎయిర్ కార్గో కాంప్లెక్స్లో 62 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది.