హై అలర్ట్.. దేశంలోకి టెర్రరిస్టులు..! రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
ఢిల్లీ : దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారత్లోకి టెర్రరిస్టులు చొరబడ్డారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో కేంద్రం అప్రమత్తమైంది. అఫ్ఘానిస్థాన్ దేశ పౌరులుగా పాసుపోర్టులు పొంది పాక్ ఐఎస్ఐ ఏజెంట్తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు భారత్లోకి ఎంట్రీ ఇచ్చారనే క్రమంలో అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం.
ఈ నెల మొదటివారంలో ఆ నలుగురు టెర్రరిస్టులు ఇండియాలోకి ప్రవేశించారని ఇంటిలిజెన్స్ బ్యూరో కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. ఆ ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా విధ్వంసక చర్యలకు పాల్పడే ఛాన్సుందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలపై ఉగ్రవాదులు కన్నేసినట్లు తమకు కీలక సమాచారం లభించిందని ఐబీ అధికారులు వెల్లడించారు.
మాజీ ఎంపీలకు షాక్.. బంగ్లాలు ఖాళీ చేయకపోతే కరెంట్, నీళ్లు కట్.. కేంద్రం అల్టిమేటం..!
ఆ క్రమంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కు ఐబీ అధికారులు సమాచారం అందించారు. అంతేకాదు ఆ నలుగురు టెర్రరిస్టులకు సంబంధించిన ఊహా చిత్రాలను కూడా వారికి చేరవేసినట్లు తెలుస్తోంది. అయితే ఇండిపెండెన్స్ డే నాడు దేశంలో అల్లర్లు సృష్టించడానికి వారు పథక రచన చేశారని.. ఆ క్రమంలో దేశమంతటా అలర్ట్గా ఉండటంతో ఆ రోజు ఎలాంటి విధ్వంసానికి పాల్పడే ధైర్యం చేయలేదనేది ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారుల అంచనా.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా దాడులకు తెగబడే ఛాన్సుందని.. ఆ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఐబీ అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని సూచించారు. వాహనాలను క్షుణ్ణంగా చెక్ చేయాలని.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాలని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, హోటళ్లు, జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని కోరారు. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా పోలీసులు అలర్ట్గా ఉంటూ తనిఖీల్లో తలమునకలైనట్లు సమాచారం.