పార్లమెంట్ ఆవరణలోకి దూసుకొచ్చిన కారు.. ఉలిక్కిపడ్డ సెక్యూరిటీ.. హై అలర్ట్
ఢిల్లీ : పార్లమెంట్ దగ్గర ఒక్కసారిగా అలజడి రేగింది. బారికేడ్లను ఢీకొట్టి దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పొజిషన్ తీసుకున్నారు. అక్కడున్నవారికి ఆ కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తీరా ఆ కారు బారికేడుకు ఢీకొని ఆగిపోయింది. ఈ హఠాత్పరిణామంతో పార్లమెంట్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. వెంటనే పార్లమెంట్ దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చివరకు ఆ కారు మణిపూర్ లోక్సభ సభ్యుడు, కాంగ్రెస్ నేత తోక్చామ్ మేన్యాకు చెందినదిగా గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
దూసుకొచ్చిన కారు.. అలర్టైన సెక్యూరిటీ
పార్లమెంటు ఆవరణలోకి కారు దూసుకురావడం దుమారం రేపింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే సదరు ఎంపీ డ్రైవర్ ఇన్ గేట్ నుంచి కాకుండా ఔట్ గేట్ నుంచి పార్లమెంట్ ఆవరణలోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఒక్కసారిగా కారు వేగం పెరిగి ముందుకు దూసుకెళ్లింది. ఓ బారికేడును ఢీకొట్టి ఆగిపోయింది. డీఎల్ 12 సీహెచ్ 4897 రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఉన్న ఆ కారు ఎంపీకి చెందినదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే సెక్యూరిటీ కళ్లుగప్పి ఔట్ గేటుకు డ్రైవర్ ఎలా వెళ్లాడనే కోణంలో.. పార్లమెంట్ భద్రతా విభాగం దర్యాప్తు చేపట్టింది.
2018లో కూడా..!
కారు పార్లమెంట్ ఆవరణలోకి దూసుకొచ్చిన ఘటనలో ఒకరికి గాయాలయినట్లు తెలుస్తోంది. కారు కూడా డ్యామేజీ అయింది. ఆ సమయంలో కారులో ఎంపీ లేరు. 2018 లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఓ ట్యాక్సీ ఎంట్రీ గేటు దగ్గర నుంచి లోపలకు దూసుకొచ్చింది. సెక్యూరిటీ సైరన్ మోగడంతో అంతా అలర్ట్ అయ్యారు. ఆ కారు కాస్తా ఓ పోల్ కు గుద్దుకుని ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఆనాటి ఉగ్రవాద దాడితో..!
2001 లో పార్లమెంట్ లక్ష్యంగా జరిగిన ఉగ్రవాదుల దాడి గురించి తెలిసినవారికి.. అది ఇంకా కళ్లముందే కదలాడుతుంది. లష్కరే, జైషే టెర్రరిస్టులు జరిపిన దాడిలో 9 మంది మృత్యువాత పడ్డారు. ఏకే 47 లాంటి ఆయుధాలతో పాటు గ్రేనేడ్లతో బీభత్సంగా దాడికి దిగడంతో సెక్యూరిటీ బలగాలు ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అప్పటినుంచి చీమ చిటుక్కుమన్నా జాగ్రత్తపడుతున్నాయి భద్రతా బలగాలు. అదేక్రమంలో మంగళవారం సడెన్ గా పార్లమెంట్ ఆవరణలోకి కారు దూసుకురావడంతో సెక్యూరిటీ మరింత పెంచారు. సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా ఆ కారు ఎలా వచ్చిందనే కోణంలో విచారిస్తున్నారు.