దేశంలోకి ఏడుగురు పాక్ ఉగ్రవాదులు.. విధ్వంసం ముప్పుతో హై అలర్ట్..
వివాదస్పద అయోధ్య అంశంపై తుదితీర్పు వెలువడే నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సైనిక, పోలీసు దళాలను మోహరింప జేశారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్లోకి పాకిస్థానీ ఉగ్రవాదులు ప్రవేశించారనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికతో యూపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాంతో యూపీ ప్రభుత్వం ఉగ్రవాదుల కదలికలపై దృష్టిపెట్టారు.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ నుంచి నేపాల్ ద్వరా యూపీలోకి ఏడుగురు టెర్రరిస్టులు ప్రవేశించారు. వారు అయోధ్య, ఫైజాబాద్, గోరఖ్పూర్లో తలదాచుకొన్నారు. అనుమానిత ఉగ్రవాదుల్లో ఐదుగురిని మహ్మద్ యాకూబ్, అబు హమ్జా, మహ్మద్ షాబాజ్, నిసార్ అహ్మద్, మహ్మద్ క్వామీ చౌదరీగా గుర్తించారు.
అయోధ్య వివాదంపై తుది తీర్పు తర్వాత యూపీలో అల్లర్లు, మారణ హోమం సృష్టించే అవకాశాలు ఉండటంతో ఉగ్రవాదుల చొరబాటును భద్రతా దళాలు సీరియస్గా పరిగణిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అయోధ్య తీర్పు నేపథ్యంలో ప్రజలకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఆదేశాలను జారీ చేసింది. మత, కమ్యూనిటీ పరమైన వ్యాఖ్యలు, ఇతర వర్గాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశంచింది. అలాగే రామజన్మభూమి, బాబ్రీ మసీద్ వివాదానిక సంబంధించిన విషయాలపై చర్చలు, డిబేట్లు చేపట్టవద్దని తీవ్రంగా అధికారులు హెచ్చరించారు.
అలాగే , తమ కార్యకర్తలకు కూడా బీజేపీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రామాలయ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని దేశవ్యాప్తంగా తమ పార్టీ అధికార ప్రతినిధులకు, సోషల్ మీడియా విభాగాలను హెచ్చరించింది. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కూడా ఇలాంటి ఆదేశాలను తమ పార్టీ వర్గాలకు జారీ చేసింది.