ఆప్ఘన్ ఆత్మాహూతి దళ ఉగ్రవాదుల కోసం వేట: ఎనిమిది జిల్లాల్లో హై అలర్ట్!
భోపాల్: ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన నలుగురు ఆత్మాహూతి దళ ఉగ్రవాదులు ప్రవేశించారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన విశ్వసనీయ సమాచారంతో మధ్యప్రదేశ్ ఉలిక్కిపడింది. ఎనిమిది జిల్లాల్లో హై అలర్ట్ ను ప్రకటించారు అధికారులు. ఎనిమిది జిల్లాల్లో జల్లెడ పడుతున్నారు. ఆఫ్ఘన్ నుంచి వచ్చినట్లు అనుమానిస్తోన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరికి సంబంధించిన ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఈ ఫొటోను మధ్యప్రదేశ్ లోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులను ఆనుకుని ఉన్న ఎనిమిది జిల్లాల్లో ఈ నలుగురు ఉగ్రవాదులు వేర్వేరుగా ఉండొచ్చంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. సరిహద్దు చెక్ పోస్టులపై నిఘా వేశారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఈ నలుగురు ఆత్మాహూతి దళ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ లోని కునార్ ప్రావిన్స్ కు చెందినవారిగా అనుమానిస్తున్నామని మధ్యప్రదేశ్ ఝబువా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ జైన్ తెలిపారు. గిరిజనులు పెద్ద సంఖ్యలో నివసిస్తోన్న ఈ జిల్లా గుజరాత్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. ఈ నలుగురూ మనదేశంలోకి ఎలా ప్రవేశించారనేది ఇంకా తేలాల్సి ఉందని మధ్యప్రదేశ్ హోం శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోందని అన్నారు. గుజరాత్ తో సరిహద్దులను పంచుకుంటున్న ఝబువాతో పాటు అలీ రాజ్ పూర్, ధార్, బర్వాణీ, రాజస్థాన్ సరిహద్దుల్లోని రత్లాం, మందసౌర్, నీముచ్, అగర్-మల్వా జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు.
ఆయా జిల్లాల్లో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. గుజరాత్, రాజస్థాన్ ల నుంచి మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించే అన్ని రైళ్లను కూడా సరిహద్దు జిల్లాల్లోనే నిలిపివేసి, సోదాలను నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. న్యూఢిల్లీ-ముంబై మార్గంలో కీలకమైన రత్లాం రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ సహకారంతో జిల్లా పోలీసులు తనిఖీలను నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి పూర్తిస్థాయి వివరాలను సేకరించిన తరువాత వదలి వేశామని అన్నారు.
వైఎస్ జగన్ తో దోస్తీకి బీజేపీ సంకేతాలు: కీలక పదవి ఆఫర్ చేసిన కేంద్రం!