మావోయిస్టుల నెక్స్ట్ టార్గెట్..ఉత్తర్ ప్రదేశ్: హెచ్చరించిన ఇంటెలిజెన్స్: హైఅలర్ట్!
లక్నో: మావోయిస్టులు తమ కార్యకలాపాలను విస్తరించుకుంటున్నారా? ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లను దాటుకుని క్రమంగా తమ దృష్టిని ఉత్తరాది రాష్ట్రాల వైపు మళ్లిస్తున్నారా? అంటే అవుననే సమాధానమిస్తున్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో క్విక్ రెస్పాన్స్ టీమ్ పోలీసులపై దాడులు చేసి 16 మందిని పొట్టనబెట్టుకున్న తరువాత మావోయిస్టుల చూపు ఉత్తర్ ప్రదేశ్ పై పడిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర్ ప్రదేశ్-బిహార్ సరిహద్దులను పంచుకుంటున్న మూడు జిల్లాల్లో బలోపేతం కావడానికి మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చరించాయి.
యూపీలో హైఅలర్ట్..
ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్ భద్ర, మిర్జాపూర్, చందౌలి జిల్లాల్లో మావోయిస్టులు ఏ క్షణమైనా దాడులు చేయడానికి అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడి పోలీసు యంత్రాంగం హై అలర్ట్ ను జారీ చేశాయి. విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. బిహార్ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలు కావడంతో ఆ రాష్ట్ర పోలీసులకు కూడా దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
మూడు జిల్లాలూ మావోయిస్టులకు కంచుకోటే
నిజానికి- మిర్జాపూర్, చందౌలి, సోన్ భద్ర జిల్లాలు ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉండేవి. క్రమంగా మావోయిస్టులు బలహీన పడ్డారు. తెరమరుగు అయ్యారు. ఛత్తీస్ గఢ్, ఏఓబీ వంటి ప్రాంతాలకు పరిమితం అయ్యారు. అడపా దడపా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో తమ ఉనికి చాటుకుంటూ వచ్చారు. గత ఏడాది దైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్యోందంతాల అనంతరం తమ ఉనికిని బలంగా చాటుకున్నారు మావోయిస్టులు. అనంతరం- ఛత్తీస్ గఢ్ లో పోలీసుల వాహనాలపై దాడులు చేస్తూ వచ్చారు. ఎన్నికలకు ముందు- ఛత్తీస్ గఢ్ లో బీజేపీ ఎమ్మెల్యేను హతమార్చి మరోసారి తమ సత్తాను చాటుకున్నారు.
గడ్చిరోలి ఘటనతో పూర్తిస్థాయి కార్యకలాపాల్లోకి..
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో క్విక్ రెస్పాన్స్ టీమ్ పోలీసుల వాహనాన్ని పేల్చి వేసి 16 మందిని హతమార్చిన ఘటన తరువాత మావోయిస్టులు ఇక బలపడ్డారనే అభిప్రాయాలు పోలీసుల్లో వ్యక్తమైంది. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు నేతృత్వంలో మావోయిస్టులు తాము కోల్పోయిన జవసత్వాలను తిరిగి సాధించుకున్నారని చెబుతున్నారు. ఇదే ఊపులో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తాము కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని, దీనికోసం మావోయిస్టులు ఎంతకైనా తెగిస్తారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
మూడు జిల్లాల్లో అదనపు బలగాలు..
ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో.. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన హెచ్చరికలతో అక్కడి ప్రభుత్వం ఉలిక్కిపడింది. సోన్ భద్ర, మిర్జాపూర్, చందౌలిలకు అదనపు బలగాలను తరలించినట్లు తెలుస్తోంది. ఈ మూడింట్లో సోన్ భద్రను అత్యంత సమస్యాత్మక జిల్లాగా భావిస్తున్నారు పోలీసులు. జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటున్న సోన్ భద్ర జిల్లాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు ఎదురైనా ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.