disha murder case: ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు ఓకే, 45 రోజుల్లోనే శిక్ష?
దిశ లైంగికదాడి హత్య కేసును విచారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. దిశ హత్య కేసు విచారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరింది. ప్రభుత్వ లేఖపై హైకోర్టు స్పందించింది. కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్టు బుధవారం స్పష్టంచేసింది.
ఫాస్ట్ట్రాక్ కోర్టు ఎందుకంటే..
దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. దీంతో కేసు విచారణ త్వరితగతిన పూర్తిచేసి నిందితులకు శిక్ష విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ కోర్టుల వల్ల సమయం ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగురోజుల క్రితం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. దిశ కేసుకు సంబంధించి ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు.
హైకోర్టు ఓకే..
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లేఖపై హైకోర్టు స్పందించింది. ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దీంతో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుపై రాష్ట్ర న్యాయశాఖ కసరత్తు ప్రారంభించింది. మహబూబ్ నగర్ కోర్టులో ఒక కోర్టును ఫాస్ట్ట్రాక్ కోర్టుగా ఏర్పాటు చేస్తారా.. లేదంటే షాద్ నగర్ కోర్టునే ఫాస్ట్ట్రాక్ కోర్టుగా చేసి విచారణ చేపడుతారనే అంశంపై ఒకటి, రెండురోజుల్లో క్లారిటీ వస్తోంది. ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను హైకోర్టు వెలువరిస్తోంది.
ఆధారాల సేకరణలో బిజీ..
దిశ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ఆధారాల సేకరణలో బిజీగా ఉన్నారు. శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. సీన్ ఆఫ్ ఎఫెన్స్, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. మొత్తం మూడు బృందాలను కేసు దర్యాప్తు చేపడుతున్నాయి. లభించిన ఆధారాలను తీసుకొని ఫొరెన్సిక్ ల్యాబ్ వద్దకు తీసుకెళ్లేందుకు ఒక బృందం సేవలు వినియోగిస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని బలమైన ఆధారాలు కోర్టులో ప్రవేశపెట్టి.. వారికి ఉరి శిక్ష విధించేలా చార్జీషీట్ రూపొందిస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఇదివరకే తెలిపిన సంగతి తెలిసిందే.
60 రోజుల్లోపై శిక్ష..
వరంగల్లో చిన్నారిపై కీచకుడు ప్రవీణ్ లైంగికదాడిపై నిరసనలు పెల్లుబికిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసింది. విచారణ చేపట్టి న కోర్టు 60 రోజుల్లో ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దిశ విషయంలో కూడా 45 రోజులకు మించకుండా నిందితులకు ఉరి శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అందులోభాగంగానే ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసింది.