ఢిల్లీని చూసి అక్కడ కూడా.. ‘ఆ మూడు గంటలే బాణాసంచా కాల్చుకోవాలి’..
ఢిల్లీలో బాణాసంచాను సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా, చండీగఢ్లో కూడా బాణాసంచాను కాల్చే సమయాన్ని అక్కడి హైకోర్టు మూడు గంటలకు కుదించింది.
చండీగఢ్, అక్టోబర్ 13: ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్)లో బాణాసంచా విక్రయాన్ని సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో పొరుగున ఉన్న పంజాబ్, హర్యానా, చండీగఢ్లో కూడా దీపావళి వేడుకలో భాగంగా బాణాసంచాను కాల్చే సమయాన్ని అక్కడి హైకోర్టు మూడు గంటలకు కుదించింది.
దీపావళి రోజున సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మాత్రమే ఈ మూడు రాష్ట్రాల పౌరులు బాణాసంచా కాల్చుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. బాణాసంచా కారణంగా కాలుష్యం తీవ్రం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన పంజాబ్, హర్యానా హైకోర్టు ఇందుకు సంబంధించి అధికారులకు అనేక సూచనలు కూడా చేసింది.
కేంద్ర పాలిత ప్రాంతంలోనూ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ తాత్కాలిక లైసెన్సుల మంజూరుకు సంబంధించి కచ్చితమైన నిబంధనలు పాటించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని న్యాయమూర్తులు ఎ.కె.మిట్టల్, అమిత్ రావల్తో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
అయితే తాము చేసిన సూచనలు పంజాబ్, హర్యానా, చండీగఢ్లకు ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను త్రికరణశుద్ధిగా అమలుచేయాలని డిప్యూటీ కమిషనర్లు, పోలీసు కమిషనర్లు, సీనియర్ ఎస్పిలను కోర్టు ఆదేశించినట్లు సీనియర్ న్యాయవాది అనుపమ్ గుప్తా తెలిపారు.
ఈ తాత్కాలిక లైసెన్సులు కూడా గత ఏడాది మంజూరు చేసిన వాటిలో 20 శాతానికి మించకూడదని కూడా కోర్టు స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు. కేవలం డిప్యూటీ కమిషనర్లకు మాత్రమే ఈ తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేసే అధికారం ఉంటుందని, ఎవరికీ వీటిని బదలాయించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసిందన్నారు.
అలాగే కోర్టు ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు గట్టి నిఘా ఉండాలని కూడా హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. కోర్టు అనుమతి లేనిదే బాణాసంచా విక్రయానికి సంబంధించి శాశ్వత లైసెన్సులను మంజూరు చేయడానికి వీల్లేదని పేర్కొన్న కోర్టు తాత్కాలిక లైసెన్సులపై కూడా పరిమితి విధించింది.
హైకోర్టు అనుమతి లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ పేలుడు పదార్థాల చట్టం కింద శాశ్వత లైసెన్సులను వర్తకులకు ఇవ్వడానికి వీల్లేదని కోర్టు నిర్ద్వంద్వంగా తెలిపినట్లు అడ్వకేట్ గుప్తా వెల్లడించారు.