బీజేపీలో చేరిన ఎమ్మెల్యే: హైడ్రామా, అడ్డుపడిన కార్యకర్తలు, దుమ్ములేపిన పోలీసులు !
కర్ణాటకలో బీజేపీలో చేరిన స్థానిక శాసన సభ్యుడు.బహిరంగ సభలో హైడ్రామా, సొంత పార్టీ కార్యకర్తల నిరసన.ఇష్టం ఉంటే ఉండండి, లేదా వెళ్లిపోండి, మాజీ సీఎం, దుమ్ములేపిన పోలీసులు
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ నాయకులకు సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. బీజేపీ చేపట్టిన నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా యాత్రలో భాగంగా సోమవారం ఉడిపి సమీపంలోని కుందాపురలో జరిగిన సమావేశంలో హైడ్రామాతో రచ్చరచ్చ అయ్యింది.
సోమవారం కుందాపురలో బీజేపీ పరివర్తనా యాత్ర జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సమక్షంలో స్థానిక స్వతంత్ర పార్టీ శాసన సభ్యుడు పాలాడి శ్రీనివాస శెట్టి అధికారికంగా బీజేపీలో చేరారు.
ఆసందర్బంలో ఇంతకాలం బీజేపీలో ఉంటూ, పార్టీ కోసం పని చేసిన స్థానిక నాయకుల వర్గీయులు శాసన సభ్యుడు పాలాడి శ్రీనివాస శెట్టిని బీజేపీలో చేర్చుకోరాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాలాడి శ్రీనివాస శెట్టి వర్గీయులు, బీజేపీ కార్యకర్తల మధ్య మాటల యుద్దం జరిగింది.
ఒకరిమీద ఒకరు దాడులు చేసుకున్నారు. బహిరంగ సభ సమావేశంలోనే ఇంత రచ్చ జరగడంతో మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అసహనం వ్యక్తం చేశారు. బీఎస్ యడ్యూరప్ప కార్యకర్తలతో మాట్లాడుతూ పాలాడి శ్రీనివాస శెట్టి స్థానిక బీజేపీ నాయకుడు, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఈయనకే టిక్కెట్టు ఇస్తుంది, ఇష్టం ఉన్న వాళ్లు పార్టీలో ఉండండి, లేదా వెళ్లిపోండి అని ఘాటుగా సమాధానం చెప్పారు. ఎమ్మెల్యే అనుచరులు, బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి దుమ్ములేపేశారు. బహిరంగ సభలో రచ్చరచ్చ కావడంతో యడ్యూరప్ప అక్కడి నుంచి వెళ్లిపోయారు.