శ్రీనగర్ విమానాశ్రయంలో యశ్వంత్ సిన్హా: అడ్డుకోవడంతో హైడ్రామా!
న్యూఢిల్లీ: శ్రీనగర్ విమానాశ్రయం చేరుకున్న మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హాను అక్కడి నుంచి భద్రతా దళాలు కదలనివ్వకపోవడంతో హైడ్రామా నెలకొంది. మంగళవారం ఉదయమే యశ్వంత్ సిన్హా శ్రీనగర్ విమానాశ్రయం చేరుకున్నారు. అయితే అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆయనను విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లనివ్వలేదు.
కన్సర్న్డ్ సిటిజెన్స్ గ్రూప్ అనే ఎన్జీఓ గ్రూప్ సహకారంతో యశ్వంత్ సిన్హా కాశ్మీర్కు పయనమయ్యారు. కపిల్ కాక్, భారత్ భూషణ్, సుశోబ బర్నాడ్ లతోపాటు ఆయన శ్రీనగర్ విమానాశ్రయంకు చేరుకున్నారు. ఉదయం 11.30గంటలకు విమానాశ్రయంలోకి చేరుకున్నప్పటికీ.. వారిని బయటికి వెల్లనివ్వకుండా అడ్డుకున్నారు.
జమ్మూకాశ్మీర్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి.. ఆంక్షలు ఎలా కొనసాగుతున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు వీరంతా కాశ్మీర్కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, విమానాశ్రయంలోనే అడ్డుకున్న భద్రతా బలగాలు.. యశ్వంత్ సిన్హాను తిరిగి ఢిల్లీకి విమానంలో వెళ్లాలని సూచించారు. కానీ, అందుకు సిన్హా నిరాకరించారు.
ఈ క్రమంలో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఈ సీనియర్ నేత.. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కూడా వ్యతిరేకించారు.