పెట్రో ధరల మంట- భారత్లో విచిత్ర పరిస్ధితి-మన ఎగుమతులే తిరిగి దేశంలోకి స్మగ్లింగ్
భారత్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో పలు చోట్ల లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరువైన పరిస్ధితి. దీంతో కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే ఇదే సమయంలో మన దేశం భారత ఉపఖండంలోని పొరుగు దేశాలకు ఎగుమతి చేస్తున్న పెట్రోలియం ఉత్పత్తులు తిరిగి భారత్లోకి అక్రమ మార్గాల ద్వారా స్మగ్లింగ్ అవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో విదేశాలకు చేసే పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపైనా విమర్శలు మొదలయ్యాయి.
భారత్లో చమురు మంటలు
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు ఎడా పెడా పన్నులు బాదేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు అక్కడ పెరిగినప్పుడు దేశీయంగా తగ్గించకపోవడంతో పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలే కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్ధితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై కనికరం చూపేందుకు నిరాకరిస్తున్నాయి. పెట్రో ధరల పాపాన్ని అంతర్జాతీయ పరిస్ధితులపై నెట్టేసి హాయిగా కాలం గడిపేస్తున్నాయి. దీంతో సామాన్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినా వెనక్కి తగ్గేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా లేవు..
ధరల మంటలోనూ ఆగని పెట్రో ఎగుమతులు
అసలే పెట్రో ధరల మంటతో సగటు జనానికి చుక్కలు కనిపిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం విదేశాలకు చమురు ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం ఆపడం లేదు. ఉల్లి పాయలు వంటి నిత్యవసర సరకుల ధరలు పెరగ్గానే విదేశాలకు ఎగుమతులు ఆపేసే కేంద్రం.. ఇప్పుడు పెట్రో ధరలు సెంచరీ దాటేసే పరిస్ధితులు వచ్చినా విదేశాలకు మాత్రం ఎగుమతులు ఆపడం లేదు. దీంతో పొరుగున ఉన్న నేపాల్కూ, అక్కడి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంకకూ ఎగుమతులు యథావిధిగా సాగిపోతున్నాయి.
పెట్రో ఎగుమతులతో స్మగ్లింగ్ అవకాశం
మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్న పెట్రో, గ్యాసోలిన్ ఉత్పత్తులను అక్కడ స్ధానిక పన్నులు తక్కువగా ఉండటంతో తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా అక్కడి అక్రమార్కులు రంగంలోకి దిగి వాటిని తక్కువ ధరకు కొనుక్కుని భారత్కు స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టేశారు. ఇలా నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి మన దేశంలోకి అవే ఉత్పత్తులు స్మగుల్ అయిపోతున్నాయి. తాజాగా నేపాల్లో సీజ్ చేసిన ఓ ఆయిల్ ట్యాంకర్లో 1360 లీటర్ల డీజిల్ను పట్టుకున్నారు. బీహార్ సరిహద్దుల్లో కేవలం రెండు మైళ్ల దూరం ప్రయాణిస్తే నేపాల్లోకి వెళ్లొచ్చు. అక్కడ భారత్ కంటే తక్కువ ధరకే పెట్రోలు, డీజిల్ దొరుకుతోంది. దీంతో బీహార్ సరిహద్దుల్లో డిమాండ్ ఆ మేరకు పడిపోయింది.
అక్కడ రోడ్లపైనే పెట్రోల్ విక్రయాలు
ఇలా భారత్ ఎగుమతి చేస్తున్న చమురు ఉత్పత్తులను తిరిగి దేశంలోకి అక్రమ రవాణా చేస్తున్న వారు దేశంలోకి వచ్చే రోడ్డు మార్గాల్లో రోడ్లపైనే వీటిని విక్రయించేస్తున్నారు. భారత్లో ఎక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ కొనడం ఎందుకని వాహనదారులు కూడా వీరి వద్దే వాటిని కొనుగోలు చేసేస్తున్నారు. దీని వల్ల సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో భారీగా అమ్మకాలు పడిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సరిహద్దుల్లోకి వచ్చే రోడ్లపైన కూడా నిఘా పెంచాలని నిర్ణయించారు.