సీబీఐలో రచ్చ రచ్చ: తవ్వే కొద్దీ పెద్ద తలకాయలే బయటపడుతున్నాయి ఎవరో తెలుసా?
కేంద్ర విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో రచ్చ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఆ సంస్థ అధిపతి అలోక్వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాల వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానంకు చేరింది. ఇక అక్కడ మొదలైన ఈ పరస్పర అవినీతి ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. ఎక్కడో మాంసం ఎగుమతి దారుడు ఖురేషీ కేసులో ప్రారంభమైన విచారణ ఏకంగా కేంద్ర మంత్రి పై కూడా ఆరోపణలు వచ్చాయంటే వ్యవహారం ఏ రేంజ్లో జరిగిందో ఊహించొచ్చు.
సీబీఐలో ఏం జరుగుతోంది...బదిలీలు ఎందుకు చేస్తున్నారు..?
సీబీఐలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఒక వ్యక్తిని కాపాడేందుకు పెద్ద స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సీబీఐ డీఐజీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. మొయిన్ ఖురేషీ కేసు విచారణ చేస్తున్న స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా ఈ కేసుతో సంబంధమున్న హైదరాబాద్ వ్యాపారి సతీష్ సానాను కాపాడేందుకు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో అలోక్ వర్మ కూడా ముడుపులు తీసుకున్నారని రాకేష్ అస్తానా ఆరోపించారు.
ఇద్దరు చేసిన ఆరోపణలపై విచారణ సంస్థ పరువు బజారుకెక్కడంతో కేంద్రం ఇద్దరినీ తాత్కాలిక సెలవుపై పంపింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావును నియమించింది కేంద్రం. ఆయన ఈ కేసును విచారణ చేస్తున్న పలువురు అధికారులను బదిలీ చేశారు. ఈ క్రమంలోనే రాకేష్ అస్తానా కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ క్యాడర్కు చెందిన అధికారి మనీష్ కుమార్ సిన్హాను మహారాష్ట్రలోని నాగ్పూర్కు పంపారు.
సీబీఐ సెంట్రల్ బోగస్ ఇన్వెస్టిగేషన్లా మారుతుంది
తన బదిలీ అన్యాయంగా జరిగిందంటూ సీబీఐ డీఐజీ మనీష్ కుమార్ సిన్హా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐలో ఉన్నతాధికారులతో సతీష్ సానాకు మంచి సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. పరిస్థితులను ఇలాగే వదిలేస్తే సీబీఐ కాస్త 'సెంట్రల్ బోగస్ ఇన్వెస్టిగేషన్' ఈడీ కాస్త' ఎక్స్టార్షన్ డైరెక్టరేట్'గా మారిపోయే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు అస్తానాపై లోతైనా విచారణ జరపాలని ఆయన్ను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని మనీష్ సిన్హా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మంగళవారం అలోక్ వర్మ పిటిషన్ పై విచారణ చేసే సమయంలో సిన్హా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది న్యాయస్థానం.
కేంద్ర మంత్రి హరిభాయ్కు ముడుపులు
ఇక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ సానా అనే వ్యక్తిని గత నెల అక్టోబర్ 20న విచారణ చేసినట్లు చెప్పిన మనీష్ సిన్హా...సీబీఐ పై తను చేసిన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నట్లు సతీష్ సానా చెప్పారని వివరించారు. అహ్మదాబాద్కు చెందిన విపుల్ అనేవ్యక్తి ద్వారా దర్యాప్తు అధికారుల నుంచి కేంద్ర మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌధురికి ఈ ఏడాది జూన్లో భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయని సిన్హా తెలిపారు. అంతేకాదు సీబీఐ అధికారులతో హరిభాయ్ మాట్లాడారని తెలిపారు. దీనిపై లోతైన విచారణ చేసినట్లు చెప్పిన సిన్హా... జూన్ మొదటి రెండు వారాల్లో ఓ ఫోన్కాల్ ట్యాప్ అయ్యిందని చెప్పారు. ఇందులో మేడ్చల్ మజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డి సతీష్ సానాల మధ్య ఒకటి రెండు కోట్ల రూపాయలు పంపడం గురించి చర్చ జరిగిందని చెప్పారు. ఇక హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూలు యజమాని గోరంట్ల రమేష్ అనే వ్యక్తిని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కె.వి. చౌదరిని సతీష్ సానా ఢిల్లీలోని ఓ చోట కలిశారు. ఇక్కడ కూడా కేసు విషయం చర్చకు వచ్చి డబ్బులు చేతులు మారాయని సిన్హా తెలిపారు. ఆ తర్వాత సీవీసీ చౌదరి... రాకేష్ ఆస్తానాను తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారని విచారణ సందర్భంగా సతీష్ తెలిపినట్లు సిన్హా వెల్లడించారు.
సోదాలు నిలిపివేయాలని అజిత్ దోవల్ నుంచి ఆదేశాలు: అలోక్ వర్మ
సతీష్ సానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయిన్ ఖురేషీ కేసును విచారణ చేస్తున్న సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్ ఇంటిలో సోదాలు చేశామని సిన్హా తెలిపారు.సోదాలు జరుగుతుండగానే అలోక్ వర్మ ఫోన్ చేసి సోదాలు నిలిపివేయాలని తనకు జాతీయభద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ నుంచి ఆదేశాలు వచ్చాయని వర్మ తమకు చెప్పినట్లు సిన్హా పేర్కొన్నారు. దేవేందర్ కుమార్ మొబైల్ ఫోన్లలో ముఖ్యమైన సమాచారం ఉందని చెప్పినప్పటికీ దాన్ని స్వాధీనం చేసుకోవద్దని ఆయన ఆదేశించినట్లు చెప్పారు. దీంతో ఒక మొబైల్ను మాత్రమే రికవర్ చేసినట్లు చెప్పారు సిన్హా. ఇదిలా ఉంటే మొయిన్ ఖురేషీ కేసులో వేధింపులు తప్పించుకోవడానికి ప్రదీప్ కోనేరు అనే వ్యక్తి విచారణాధికారి దేవేంద్ర కుమార్కు రూ.50 లక్షలు ఇచ్చినట్లు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కు సమాచారం అందింది.
రాకేష్ అస్తానాను కాపాడేందుకు రంగంలోకి 'రా' అధికారులు
సతీష్ సానాను, మొయిన్ ఖురేషీలను కేసు నుంచి తప్పించేందుకు పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగానే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్' రా ' అధికారులు కూడా రంగంలోకి దిగారు. దుబాయ్లో నివసిస్తున్న సోమేష్ ప్రసాద్, మనోజ్ ప్రసాద్ల తండ్రి దినేశ్వరప్రసాద్ ఒకప్పుడు 'రా' అధికారిగా పనిచేశారు. ఆయనకు ధోవల్తో సన్నిహిత సంబంధాలున్నాయని మనోజ్ ప్రసాద్ విచారణ సందర్భంగా వెల్లడించినట్లు మనీష్ సిన్హా తెలిపారు. అలాంటి తనను ప్రశ్నించడమేంటంటూ సీబీఐ అధికారులను మనోజ్ ప్రసాద్ బెదిరించారని సిన్హా చెప్పారు. మనోజ్ బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలోని డబ్బులను తరలించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆ ఖాతాలను సంభింపజేయాలని బ్యాంకులకు చెప్పేందుకు లేఖ సిద్ధం చేసిన నేపథ్యంలోనే దర్యాప్తు బృందాన్ని బయటకు పంపేశారని మనీష్ సిన్హా వెల్లడించారు.
సతీష్ సానాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరిన కేంద్ర కేబినెట్ కార్యదర్శి
అలోక్ వర్మపై సీవీసీ దర్యాప్తు సాగుతుండగానే కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేష్ చంద్ర ఈ విషయంలో కలగజేసుకున్నారు. సతీష్ను తప్పించేందుకు తన ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగానే సతీష్తో మాట్లాడాలని ఏపీ క్యాడర్ ఐఏఎస్ రేఖారాణితో చెప్పారు. దీంతో నవంబర్ 8న ఆమె సతీష్ సానా ఆఫీసు సిబ్బందికి ఫోను చేసి సురేష్ చంద్ర సతీష్సానాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని సతీష్ సానాకు సిబ్బంది చేరవేయడంతో ఆయన వాట్సాప్లో సురేష్ చంద్రతో మాట్లాడారు. తను నీరవ్ మోడీ కేసు విషయమై లండన్లో ఉన్నట్లు సానాకు చెప్పిన సురేష్ చంద్ర... తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చినట్లు సిన్హా తెలిపారు. తనకు పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి పి.కె. సిన్హా చెప్పారని ఇదే విషయమై సానాకు చెప్పేందుకు నాలుగురోజులుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారని సిన్హా వెల్లడించారు. 14వ తేదీ కలుద్దామని చెప్పిన సురేష్ చంద్ర ఐబీ కూడా సానాపై కన్ను వేయడం లేదని సురేష్ వివరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని లండన్ హోటల్లో తనను కలిసిన చాముండేశ్వరి నాథ్ ద్వారా కూడా చేరవేసేందుకు ప్రయత్నించినట్లు సురేష్ చంద్ర చెప్పారు.