ఆధార్ స్కీం రద్దయ్యే అవకాశం: లాయర్ ప్రసన్న
బెంగళూరు: వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది ఎస్ ప్రసన్న వన్ఇండియాతో ఆధార్ స్కీంపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఆధార్ స్కీంపై పలు కీలక వివరాలను పంచుకున్నారు. ఆధార్ స్కీం రద్దయ్యే అవకాశం కూడా ఉందని అన్నారు.
ప్రశ్న: ఆర్టికల్ 21, రాజ్యాంగంలోని పార్ట్-3 ప్రకారం వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆధార్ కోసం సమాచారాన్ని ఎలా సేకరించాల్సి ఉంటుంది?
ప్రసన్న: వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ హక్కుపై ఆంక్షలు పెట్టడం సరైంది కాదు. చట్ట బద్ధంగా అమలు చేయాల్సి ఉంటుంది. 2016 వరకు ఆధార్ ప్రాజెక్టుకు ఎలాంటి చట్టబద్ధతా లేదు. 2016కి ముందు సేకరించిన సమాచారం ఏ చట్టాన్నీ అనుసరించి చేయలేదు. నా ఆలోచన ప్రకారం ఆ సమాచారాన్ని నాశనం చేయాల్సిందే. సేకరించిన సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు భారతదేశం త్వరలో డాటా ప్రొటక్షన్ లా చేయాల్సి ఉందని నా అభిప్రాయం. దీనిపై ఓ కమిటీ కూడా వేసే అవకాశం ఉంది.
ప్రశ్న: ఉన్నత వర్గాల గోప్యత కంటే కూడా ఆధార్ స్కీం పేద ప్రజల జీవితానికే ప్రాధాన్యత ఇస్తోందని కేంద్రం చెబుతోంది. అయితే, వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం సందిగ్ధంలో పడింది. అంతేగాక, కేంద్రం, కోర్టు వైరుధ్య భావాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎలా ఈ వైరుధ్యం తొలగిపోతుందనుకుంటున్నారు? ఆధార్పై కేంద్రం చివరి ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది?
ప్రసన్న: పేద ప్రజలకు మాత్రం వ్యక్తిగత గోప్యత అవసరం లేదా? అలా అని వారు చెప్పారా?. పేదరికం, వ్యక్తిగత గోప్యతలలో ఏదో ఒకటి ఎంచుకోవాలని ప్రభుత్వం బలవంతం చేస్తే ఎలా? సమాజంలో అన్ని వర్గాలకు సమాన హక్కులు కావాలనే కోరుకుంటారు. కానీ, వాస్తవానికి అలా జరగడం లేదు.
ప్రశ్న: పౌరుల లైంగిక ప్రాధాన్యతలపై కూడా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సెక్షన్ 377ను భవిష్యత్లో రద్దు చేసే అవకాశాలేమైనా ఉన్నాయా?
ప్రసన్న: సెక్షన్ రద్దు చేసే విస్పష్టమైన అవకాశాలున్నాయి. పార్లమెంటు దయకు వదిలివేయకుండా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవడం హర్షనీయం.
ప్రశ్న: వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దానిపై అవసరమైన ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటి?
ప్రసన్న: వ్యక్తిగత గోప్యత, వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. అవి అందరికీ ఆమోద యోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న: గతంలో ఇచ్చిన తీర్పులపై తాజా తీర్పు ప్రభావం ఏలా ఉంటుంది?
ప్రసన్న: ఈ తీర్పు చాలా పథకాలపై ప్రభావం ఉంటుంది. భవిష్యత్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లుపై కూడా ఈ ప్రభావం ఉంటుంది.
కాగా, ఆగస్టు 24, 2017న సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కుల కిందకే వస్తుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 21, భారత రాజ్యాంగం పార్ట్ 2 ప్రకారం కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.