కొత్త సంవత్సరంలో నయా నెంబర్ ప్లేట్లు.. అన్ని వాహనాలకు తప్పనిసరి..!
ఢిల్లీ : కొత్త సంవత్సరంలో అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించాల్సిందేనని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈమేరకు పార్లమెంట్ లో ప్రకటన చేసింది. దీంతో ఏప్రిల్ 1 తర్వాత వాహనాలకు ట్యాంపర్ ప్రూఫ్ హై సెక్యూరిటీ (HSRP) నంబర్ ప్లేట్లు తప్పనిసరైంది. ఈమేరకు వాహన తయారీదారులు తమ డీలర్లకు దీనిపై అవగాహన కల్పించాలని కోరారు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ.
కేంద్ర రవాణా వాహనాల చట్టం 1989 లోని HSRP ఆర్డర్స్ 2001 ని గతంలో కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీనిపై ప్రజల నుంచి పెద్దఎత్తున వచ్చిన వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది కేంద్రం. దీంతో 2018 జూన్ లో జరిగిన ఓ సమావేశంలో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు గడ్కరీ.
ఆయా రాష్ట్రాలకు చెందిన రవాణాశాఖ అధికారులు, సెంట్రల్ రోడ్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫాక్చర్స్, ఆటోమోటివ్ రీసెర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు ఈ మీటింగ్ కు హాజరై ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ నెంబర్ ప్లేట్లతో భద్రత ఉండటమే గాకుండా.. నకిలీ నెంబర్లకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తొలగించడం కాని, పునర్వినియోగం చేయడం కుదరదని పేర్కొన్నారు.