తస్మాత్ జాగ్రత్త: ఈ రాష్ట్రాల్లోనే HIV కేసులు అధికంగా ఉన్నాయి
Recommended Video
భారతదేశంలో హెచ్ఐవీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం శుభవార్తగా నిలువగా... ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మిజోరాం, త్రిపురా రాష్ట్రాల్లో మాత్రం ఎయిడ్స్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్య కుటంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లోక్ సభలో తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో హెచ్ఐవీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో వివరణ ఇచ్చింది ఆ శాఖ.అక్కడ డ్రగ్స్ కేసులు ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే... లైంగికంగా కలిసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించడం లేదని మంత్రి తెలిపారు.
మిజోరాంలో నాలుగు ప్రాంతాల్లో, త్రిపురాలోని ఒక ప్రాంతంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారిలోనే ఎక్కువగా హెచ్ఐవీ ఉన్నట్లు గుర్తించామని మంత్రి సభకు తెలిపారు. దేశం మొత్తం మీద ఇలాంటి కేసులు 6.3శాతంగా ఉన్నాయి. మరోవైపు ఐజ్వాల్లో డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల్లో హెచ్ఐవీ 37.44శాతం ఉండగా... చంపాయ్లో 33.06శాతం, కోలసిబ్ ప్రాంతంలో 38.14 శాతంగా ఉంది. ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా మహిళల్లోనే ఎక్కువగా హెచ్ఐవీ కేసులు బయటపడ్డట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఎయిడ్స్ పై అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని జిల్లాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సమీరన్ పండా. ఎయిడ్స్ బారినుంచి పడకుండా నివారణ మార్గాలు అన్వేషించాలని ఆయన చెప్పారు. అదే విషయమై జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. హెచ్ఐవీ సోకి ప్రస్తుతం 12.28లక్షల మంది చికిత్స పొందుతున్నారని చెప్పిన పాండా.. ఇంకా చాలామంది హెచ్ఐవీతోనే బాధపడుతున్నారని... అలాంటి వారికి చికిత్స అందేలా చూడాలని చెప్పారు. భారత్లో దాదాపు 21 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని అందులో కనీసం 90 శాతం మందికి చికిత్స చేయించడమే తన లక్ష్యం అని పాండా చెప్పారు.