ఒక్కరోజులో అత్యధిక కరోనా కేసులు.. సీఎం విజయన్ కీలక సూచనలు..
కేరళలో శుక్రవారం(మే 22) కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసుల్లో మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చినవారు 21 మంది ఉండగా.. విదేశాల నుంచి వచ్చినవారు 17 మంది ఉన్నారు. తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున వచ్చారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తంగా 732 కరోనా కేసులు నమోదవగా.. ప్రస్తుతం 216 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
'ఈరోజు కేసులు ఒక్కసారిగా పెరగడం ప్రమాదకర సంకేతం. మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇప్పటినుంచి రాష్ట్రానికి వచ్చేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. బయటినుంచి వచ్చే మలయాళీలెవరికీ మనం తలుపులు మూయలేం. కాబట్టి మరింత పకడ్బందీ చర్యలు అవసరం.' అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రెస్మీట్లో పేర్కొన్నారు.
మే 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతుండటంతో.. ప్రెస్మీట్లో విజయన్ కీలక సూచనలు చేశారు. బయటినుంచి కేరళకు వచ్చే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా 14 రోజులు క్వారెంటైన్లో ఉండాల్సిందేనని చెప్పారు. అయితే కేవలం ఒకటి,రెండు రోజుల పని మీద వచ్చేవారి కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయబోతున్నామని చెప్పారు.
మే 26వ తేదీ నుంచి 10,11,12 తరగతుల విద్యార్థులకు పరీక్షలు కూడా నిర్వహించేందుకు సిద్దమవుతోంది. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అలాగే అన్ని పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఫైర్ ఫోర్స్ టీమ్స్ పనిచేస్తాయి. ఏదేమైనా కరోనా వైరస్ నియంత్రణ విషయంలో కేరళ అందరి చేత ప్రశంసలు అందుకుంది. గతంలో నిఫా లాంటి వైరస్ను ఎదుర్కొన్న అనుభవంతో కరోనా నియంత్రణ విషయంలో సమర్థవంతంగా పనిచేస్తోంది.