డ్రాగన్కు దెబ్బ:హైవేల నిర్మాణం టెండర్లు రద్దు, టెలీకాం ప్రాజెక్టులు కూడా, చైనా ఆర్థిక మూలాలపై దెబ్బ
డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద బలగాలను మొహరించి కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనాకు.. అదే స్థాయిలో స్పందిస్తోంది. తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీలో కల్నల్ సహా 20 మంది భారతమాత ముద్దుబిడ్డలను పొట్టనపెట్టుకోవడంతో.. అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతోపాటు టిక్టాక్ సహా 59 యాప్లను నిషేధించి.. చైనాకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఇప్పుడు దేశంలో నిర్మాణ సంస్థల్లో భాగస్వామ్యమైన చైనా కంపెనీలకు ముకుతాడు వేస్తోంది. దీంతో ఏం చేయాలో డ్రాగన్ కంట్రీ, నిర్మాణ సంస్థలకు అర్థం కానీ పరిస్థితి నెలకొంది. భారత్ ప్రతీచర్యకు చైనా ఉక్కిరి బిక్కరి అవుతోంది.
ఆర్థిక మూలాలపై దెబ్బ
జవాన్లను రాళ్లతో కొట్టి చంపడంతో.. దేశంలో చైనా యాప్స్ నిషేధించి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టింది. హైవేల నిర్మాణం, పారిశ్రామిక రంగం, టెలికాం రంగం, రైల్వే రంగాల్లో చైనాకు చెందిన కంపెనీల భాగస్వామ్యాన్ని క్రమంగా నిషేధిస్తూ వస్తోంది. దీనిని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ధృవీకరించారు. దేశంలో హైవే నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలు, ఆ దేశ సంస్థల భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా అనుమతించబోమని తెలిపారు. దీనిపై తర్వలో విధాన నిర్ణయం ప్రభుత్వం వెల్లడిస్తుందని ఆయన చెప్పారు.
టెండర్లు రద్దు
నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ పనులను స్వదేశీ సంస్థలు దక్కించుకునేందుకు అర్హత ప్రక్రియను మరింత సులభతరం చేస్తామని గడ్కరీ తెలిపారు. అందుకోసం ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీచేశామని తెలిపారు. నిర్మాణం మొదలైన ప్రాజెక్టులతోపాటు కొత్త టెండర్లలో చైనా సంస్థలను నిషేధిస్తామని.. అవసరమైతే కొత్త టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో (ఎంఎస్ఎంఈ) చైనా సంస్థల భాగస్వామ్యానికి ఫుల్ స్టాప్ పెడతామని చెప్పారు. టెక్నాలజీ, రీసెర్చ్, కన్సల్టెన్సీ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అయితే ఇతర విదేశీ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇందులో చైనా మాత్రం నిషేధిత జాబితాలో చేరిపోయిందని స్పష్టంచేశారు.
బీఎస్ఎన్ఎల్ 4జీ
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 4 జీ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రాజెక్టు కోసం టెండర్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే చైనాకు చెందిన సంస్థలు ఉండటంతో టెండర్లను రద్దు చేసింది. 4జీ ప్రాజెక్టుల్లో చైనా సంస్థల ఉత్పత్తులను వాడొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో.. బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు కోసం రెండువారాల్లో కొత్త టెండర్లను ఆహ్వానించనుంది. ముఖ్యంగా స్వదేశీ సంస్థలకే ప్రాధాన్యం ఇస్తారు.
75 శాతం చైనా వాటా
వాస్తవానికి ఇండియన్ టెలికాం వ్యాపారంలో 75 శాతం చైనాకు చెందిన హవేయ్ టెక్నాలజీస్, జెడ్టీఈ కార్పొరేషన్ సంస్థల వాటా ఉంది. కొత్తగా ప్రభుత్వ చర్యలతో వాటి ఆదిపత్యానికి గండి పడనుంది. ఆ రెండు సంస్థలతో జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉంది అని అమెరికా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా కంపెనీకి ప్రయోజనం కల్పించేలా ఉందనే కారణంతో రైల్వే టెండర్ను కూడా రద్దు చేసింది.
Recommended Video
కంప్లైంట్.. టెండర్ రద్దు
800 థర్మల్ కెమెరాల కోసం గతనెలలో రైల్వే టెండర్లను ఆహ్వానించగా.. అందులో ఒక నిబంధన చైనాకు చెందిన సీసీ కెమెరాల సంస్థ హిక్ విజన్కు అనుకూలంగా ఉందని కొన్ని సంస్థలు రైల్వేశాఖకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆ టెండర్ రద్దు చేసి.. మళ్లీ కొత్త టెండర్ ఆహ్వానించారు. ఇలా చైనా కంపెనీల ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బకొడుతోంది. దీంతో డ్రాగన్ కంట్రీ అచేతనంగా ఉండిపోయింది. భారత్ దెబ్బకు.. ఆ దేశ గుబ గుయ్ మంటున్నట్టే ఉంది పరిస్థితి.