ఎమ్మెల్యేలతో బేరసారాలు... బీజేపీ అన్లిమిటెడ్ ఆఫర్... సీఎం గెహ్లాట్ సంచలనం..
రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలకు ఎట్టకేలకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శిబిరంలో ఆందోళన సద్దుమణిగింది. అయితే ఆ పార్టీని ఇప్పుడు మరో టెన్షన్ వెంటాడుతోంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లాగేందుకు బీజేపీ బేరసారాలకు దిగుతోందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పరోక్ష ఆరోపణలు చేశారు. అంతేకాదు,ఒక్కో ఎమ్మెల్యేకు ఎంత ఆఫర్ చేస్తున్నారో కూడా చెప్పారు.
అన్లిమిటెడ్ ఆఫర్...
అగస్టు 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ఆమోదం లభించడంతో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాలు మొదలయ్యాయని అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఒక్కో ఎమ్మెల్యేకు మొదటి విడత కింద రూ.10కోట్లు,రెండో విడత కింద రూ.15 కోట్లు ఆఫర్ చేసినవాళ్లు... ఇప్పుడు అన్లిమిటెడ్ ఆఫర్ ఇస్తున్నారని చెప్పారు. ఆ ఆఫర్ ఎవరిస్తున్నారో కూడా అందరికీ తెలిసిందేనని పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేశారు.
మాయావతిపై మండిపడ్డ గెహ్లాట్...
అసెంబ్లీలో బలపరీక్ష జరిగితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేయాలని ఆరుగురు బీఎస్సీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత్రి మాయావతి విప్ జారీ చేయడంపై ముఖ్యమంత్రి గెహ్లాట్ మండిపడ్డారు. మాయావతి బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఒత్తిడి మేరకే కాంగ్రెస్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు పార్టీని వీడితే చట్టబద్దంగా విలీనం అవుతుందని.. కాబట్టి మాయావతి వాదన చెల్లదన్నారు.
Recommended Video
కాంగ్రెస్ని ఇరుకునపెడుతున్న మాయావతి...
2019లో బీఎస్పీ టికెట్పై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ ఆరుగురు కాంగ్రెస్లో చేరిపోయారు. బీఎస్పీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ జోషికి లిఖితపూర్వక లేఖ రాశారు. అయితే బీఎస్పీ అధినేత్రి దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. తమది జాతీయ పార్టీ అని.. మండల స్థాయి నుంచి... జాతీయ స్థాయి వరకూ అందరూ విలీనమైతేనే విలీనం జరిగినట్లు అని అందులో పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ ఏ పార్టీలోనూ బీఎస్పీ విలీనం కాలేదని అన్నారు. మాయావతి పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు,స్పీకర్కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.