'హైక్ మెసేంజర్' ఉద్యోగులకు షాక్: లేఆఫ్స్ షురూ, ఎంతమందిని సాగనంపుతారో!
న్యూఢిల్లీ: దేశీ మెసేజింగ్ యాప్ 'హైక్'.. ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 20-25శాతం ఉద్యోగులను సాగనంపేందుకు చర్యలు ప్రారంభించింది. పనితీరును కారణంగా చూపిస్తూ ఉద్యోగులపై వేటు వేస్తోంది. హార్డ్వేర్ మేకర్ క్రియో, సోషల్ నెట్వర్కింగ్ వెంచర్ ఇన్స్టాలైవ్లీల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. ఆ ప్రభావం ఉద్యోగులపై పడిందని చెబుతున్నారు.
తాజా లేఆఫ్స్ తో 75మంది ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. హైక్ మెసేంజర్ అధికార ప్రతినిధి సైతం లేఆఫ్స్ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఎంతమందిపై వేటు వేస్తారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. 'గతేడాది జరిపిన కొన్ని కొనుగోళ్ల వలన ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులో బెంగళూరులోనే ఎక్కువశాతం ఉన్నారు. కొన్ని టీమ్స్ ను కలపడం, క్రమబద్దీకరించడం చేస్తున్నాం.' అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
మానవ వనరుల విభాగం, అకౌంటింగ్, ఫైనాన్స్ వంటి వాటిల్లో ఈ లేఆఫ్స్ ప్రక్రియ ఉండనున్నట్టు సమాచారం. వేటు పడే ఉద్యోగులకు రెండు నెలల శాలరీతో సెవరెన్స్ ప్యాకేజీని కూడా కంపెనీ అందించనుందని తెలుస్తోంది. కాగా, హైక్ గతేడాది కొనుగోలు చేసిన క్రియోలో ప్రస్తుతం 50మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇన్స్టాలైవ్లీ ఆపరేట్ చేసే పల్స్ అనే నెట్వర్కింగ్ యాప్ను కూడా 2017 ఫిబ్రవరిలో హైక్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరో 5 నెలల్లోనే కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేసింది. డేటా లేకున్నా సరే మెసేజింగ్ రీచార్జ్ చేసుకునే సర్వీసులను ఇది అందిస్తోంది.