హిల్లరీ క్లింటన్ పోటీ: జయలలిత కారణం, అన్నాడీఎంకే
చెన్నై: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ బరిలో దిగడానికి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత కారణం అని అన్నాడీఎంకే నాయకులు చెబుతున్నారు. జయలలిత స్పూర్తితోనే హిల్లరీ క్లింటన్ ఎన్నికల బరిలోకి దిగారని చెప్పారు.
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో మొదటి సారి మహిళా అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పోటీ చెయ్యడానికి కారణమేంటి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ పొందడానికి స్పూర్తినిచ్చింది ఎవరు అని మీకు తెలియాలి అని అన్నాడీఎంకే శాసన సభ్యుడు రాము చెప్పారు.
అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అందుకు కారణం అని శాసన సభ్యుడు రాము మంగళవారం సాక్షాత్తు తమిళనాడు అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో ఇలా అమ్మ భక్తిని చాటుకుని అందరిని ఆకర్షించడానికి ప్రయత్నించారు.
అమెరికా చరిత్రలో ఓ మహిళ తొలిసారి ప్రధాన పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. ఆ మహిళా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గతంలో భారత్ పర్యటనకు వచ్చారని అన్నారు. ఆ సమయంలో హిల్లరీ జయలలితను కలుసుకున్నారని అన్నారు.
ఆ సమావేశానికి ఎంతో ప్రాధాన్యం ఉందని రాము చెప్పారు. అమ్మ జయలలితతో మాట్లాడిన హిల్లరీ ఎంతో స్పూర్తి పొందారని గుర్తు చేశారు. అమ్మ వ్యక్తిత్వం, ఆమె రాజకీయ జీవితం, ఇంగ్లీష్ బాషలో ప్రావీణ్యం గురించి హిల్లరీ తెలుసుకున్నారని అన్నారు.
అమ్మ గురించి తెలుసుకున్న హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా నామినేషన్ పొందడానికి కారణం అమ్మే అని అసెంబ్లీలో రాము చెప్పారు.
అమ్మ భక్తిని ఇలా చాటుకుంటారా అంటూ ప్రతిపక్ష శాసన సభ్యులు ముక్కున వేలు వేసుకున్నారు. 2014లో రాము అన్నాడీఎంకేలో చేరి మొదటి సారి శాసన సభ్యుడిగా గెలుపొందాడు. ఇప్పుడు అమ్మ భక్తిని ఇలాచాటుకుని పార్టీలో కీలక వ్యక్తిగా నిలిచాడు.