పార్టీ గెలిచింది.. ప్రముఖులు ఓడారు! హిమాచల్ ప్రదేశ్లో విచిత్రం, మోడీ స్వగ్రామంలోనూ...
హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారాన్ని దక్కించుకుంది. కమలం పార్టీ విజయం సాధించినప్పటికీ ఆ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు ఓడిపోయారు.
సిమ్లా: హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారాన్ని దక్కించుకుంది. కమలం పార్టీ విజయం సాధించినప్పటికీ ఊహించని విధంగా ఆ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు ఓడిపోయారు.
Recommended Video
ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్కుమార్ ధుమాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్ సింగ్ సత్తి పరాజయం పాలయ్యారు. సుజాన్పూర్ నుంచి పోటీ చేసిన ధుమాల్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రాణా చేతిలో 3,500 ఓట్ల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూశారు.
ఎన్నికలకు రెండు వారాలు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును బీజేపీ ప్రకటించింది. గతంలో రెండు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కూడా. అయితే తన ఓటమి అనంతరం ధుమాల్ మాట్లాడుతూ.. తన ఓటమికి ప్రాధాన్యం లేదని, పార్టీ గెలుపే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బీజేపీని గెలిపించేందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే తన ఓటమిని ఏమాత్రం ఊహించలేదని, తన పరాజయానికి గల కారణాలను విశ్లేషించుకుంటానని చెప్పారు.
ఉనా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సత్పాల్ సింగ్ సత్తికి కూడా ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ సింగ్ రైజడా చేతిలో 3,196 ఓట్ల తేడాతో ఈయన ఓడిపోయారు. 2012 ఎన్నికల్లో ఇదే నియోజకర్గం నుంచి సత్పాల్ సింగ్ సత్తి 4,746 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
స్వగ్రామంలో మోడీకి షాక్...
గుజరాత్లో బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నా ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం ఉంఝాలో మాత్రం పరాజయం పాలైంది. ఈ నియోజకవర్గంలోనే ప్రధాని మోడీ స్వగ్రామం వాద్నగర్ ఉంది.
ఇక్కడి నుంచి బీజేపీ తరపున నారాయణ్భాయ్ లల్లుదాస్ పటేల్ బరిలోకి దిగగా, కాంగ్రెస్ నుంచి ఆశా పటేల్ పోటీలో నిలిచారు. హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి నారాయణ్భాయ్పై కాంగ్రెస్ అభ్యర్థి ఆశాపటేల్ 19 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2012 ఎన్నికల్లో నారాయణ్భాయ్ లల్లుదాస్ చేతిలో ఆశాపటేల్ 25 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో నారాయణ్భాయ్ లల్లుదాస్ పటేల్పై.. ఆశా పటేల్ గెలిచి గత ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.