సీఎంతో నాకు ఎఫైర్ ఉంది: గాయని సంచలనం
గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ చిక్కుల్లోకి నెట్టి ఆరోపణలు ఇటీవల వెలుగుచూశాయి. ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్, తానూ మనసులు ఇచ్చి, పుచ్చుకున్నామని గాయని అలోక పాండే తన గత కాలపు మధురానుభూతులను ఓ టీవీ ఇంటర్వ్యూలో నెమరు వేసుకున్నారు.
తన తల్లి, ప్రముఖ జానపద గాయని ప్రతిమ బారువా పాండే మరణించడంతో ఉద్యోగం కోసం తాను తరుణ్ గొగోయ్ని 2004లో కలిసినట్లు అలోక పాండే తెలిపారు. తనను చూసిన తరుణ్ పరవశుడయ్యారని, ఇరువురం 2004 నుంచి 2006 వరకు ప్రేమలో మునిగి తేలామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి అధికార నివాసం కోయినధారలో అణువణువూ తనకు తెలుసునని తెలిపారు. అందులోని ప్రతి గది ముచ్చట తనకు ఎరుకేనన్నారు. అంతేగాక, గౌరిపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని చెప్పడంతో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని అలోకా పాండే తెలిపారు.
సీఎంతో తనకు ఎఫైర్ ఉందన్న విషయం చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలకు, మంత్రులకు కూడా తెలుసునని ఆమె చెప్పారు. కాగా, అలోక పాండే 2006లో ఈ విషయాన్ని బయటపెట్టినపుడు తరుణ్ గొగోయ్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు.
తాజాగా ఆమె అవే ఆరోపణలను మళ్లీ చేయడంపై తరుణ్ గొగోయ్ స్పందిస్తూ.. ఆమె నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఈసారి తాను పరువు నష్టం దావా వేయబోనని స్పష్టం చేశారు.
కాగా, కాంగ్రెస్ పార్టీలో గతంలో శక్తిమంతమైన నేత హిమాంత బిశ్వ శర్మ భార్య నడుపుతున్న ఛానల్లో అలోక పాండే ఇంటర్వ్యూ ప్రసారమైందని, హిమాంత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేశారని తరుణ్ గొగోయ్ ఆరోపించారు.