ఆ వివాహం చెల్లదు: మద్రాసు హైకోర్టు సంచలనం
మధురై: హిందూ మహిళ, క్రైస్తవ మతానికి చెందిన పురుషుడు పెళ్లిచేసుకుంటే ఆ వివాహం చట్టప్రకారం చెల్లదని మద్రాసు హైకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. ఒకవేళ ఆ వివాహం చెల్లుబాటు కావాలంటే ఇరువురిలో ఏవరైనా ఒకరు ఇతర మతంలోకి మారాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రేమించుకున్న హిందూ మతానికి చెందిన ఓ యువతి, క్రైస్తవ మతానికి చెందిన ఓ యువకుడు గుడిలో పెళ్లిచేసుకున్నారు. యువతి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని పేర్కొంటూ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు యువతిని కోర్టులో హాజరుపర్చారు.
కేసు విచారణ అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ పి.ఆర్. శివకుమార్, జస్టిస్ వి.ఎస్.రవిలు హెబియస్ కార్పస్ పిటిషన్ను తోసిపుచ్చి తీర్పును వెలువరించారు. హిందూ వివాహ చట్టం ప్రకారం క్రైస్తవుడైన వరుడు అయితే హిందూ మతంలోకి మారాలి లేదా క్రైస్తవం ప్రకారమైతే యువతి క్రైస్తవ మతం స్వీకరించాల్సి ఉంటుందని చెప్పారు.
లేదంటే వేర్వేరు మతాలకు చెందిన ఇరువురు వ్యక్తులు ఒక్కటవ్వాలనుకుంటే 1954 వివాహ చట్టం ప్రకారం పెళ్లిచేసుకోవాలని చెప్పారు. అప్పుడు మాత్రమే వారి వివాహానికి చట్టబద్దత లభిస్తుంది. అయినప్పటికీ చట్టప్రకారం యువతి మేజర్ కాబట్టి ఎక్కడికి వెళ్లాలనేది ఆమె ఇష్టమని న్యాయమూర్తులు చెప్పారు.
తన అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు తీర్పును వెలువరించింది. ఈ విషయంలో ఎవరి సహాయం ఆమెకు అవసరం లేదని చెప్పింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితోనే వెళ్లడానికి ఆ మహిళ నిర్ణయించుకుంది.