తాజ్ మహల్ పరిసరాల్లో కలకలం... హిందూ జాగరణ్ నేతల హల్చల్.. గంగా జలం చల్లి...
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ పరిసరాల్లో ఆదివారం(అక్టోబర్ 25) కొంతమంది వ్యక్తులు హల్చల్ చేశారు. ఓ చేతిలో కాషాయ జెండా,మరో చేతిలో 'గంగా జలం' నింపిన బాటిల్ పట్టుకుని తాజ్మహల్లో కలియదిరిగారు. తాజ్ మహల్ పరిసరాల్లో గంగా జలాన్ని చల్లారు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలోనూ పలు రైట్ వింగ్ గ్రూప్స్ తాజ్ మహల్లో ఇలాగే హల్ చల్ చేశాయి.
సీఐఎస్ఎఫ్ సిబ్బందికే ఎదురు ప్రశ్న..
ఆ వ్యక్తులు హిందూ జాగరణ్ మంచ్ యువ విభాగానికి చెందినవారిగా సీఎఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. వారి పేర్లు,చిరునామాలు నమోదు చేసుకున్న సిబ్బంది... తాజ్మహల్లో ఇలాంటి కార్యకలాపాలపై నిషేధం ఉందని వారికి చెప్పారు. ఈ క్రమంలో గౌరవ్ ఠాకూర్ అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్ సిబ్బందినే ఎదురు ప్రశ్నించాడు. అలాంటప్పుడు తాజ్ మహల్లో నమాజుకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించాడు. అంతేకాదు,ఈ ప్రదేశం తేజో మహాలయ అని.. ఇక్కడ పూజ చేసేందుకే తాము వచ్చామని చెప్పాడు. దాదాపు గంట పాటు సాగిన విచారణ తర్వాత సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారిని వదిలిపెట్టారు.
హిందూ జాగరణ్ నేత ఏమంటున్నారు..
అనంతరం హిందూ జాగరణ్ మంచ్ యువ విభాగం ఆగ్రా అధ్యక్షుడు గౌరవ్ ఠాకూర్ మాట్లాడుతూ... మన్వీందర్ సింగ్,వివేశ్ అనే తమ ఇద్దరు కార్యకర్తలతో కలిసి తాను తాజ్మహల్ లోపలికి వెళ్లినట్లు చెప్పారు. మధ్యాహ్నం 12గం. సమయంలో తూర్పు వైపు ఉన్న గేటు నుంచి లోపలికి వెళ్లినట్లు చెప్పారు. గంగా జలం నింపిన బాటిల్,కాషాయ జెండాను జేబులో పెట్టుకుని లోపలికి అడుగుపెట్టినట్లు తెలిపారు. తమ వద్ద ఉన్న సెల్ఫీ స్టిక్కి జెండాను తగిలించి... అక్కడ దాన్ని ప్రదర్శించామన్నారు. ఇదే క్రమంలో తాజ్ పరిసరాల్లో గంగా జలాన్ని చల్లుతుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
తాజ్లో వివాదాలు కొత్తేమీ కాదు..
తాజ్మహల్ పరిసరాల్లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. గతంలో పలు రైట్ వింగ్ గ్రూప్స్ ఇలాగే పూజ పేరుతో అక్కడ హల్చల్ చేశాయి. 2008లో శివసేన వ్యక్తులు తాజ్ మహల్లోకి వెళ్లి పరిక్రమ పూజ నిర్వహించారు. అనంతరం వారిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో రైట్ వింగ్కు చెందిన కొందరు మహిళలు తాజ్మహల్ లోపల ఉన్న మసీదులో పూజలు నిర్వహించడమే కాకుండా... నిజానికి అది శివాలయం అని వాదించారు. రైట్ వింగ్ అభిప్రాయం ప్రకారం... ఇప్పుడున్న తాజ్ మహల్ నిజానికి తేజో మహాలయా అనే హిందూ దేవాలయం అని... దాని లోపల శివలింగం ఉందనేది వారి వాదన.