ఖాన్ త్రయం మతం మారాలి, భార్యలపై ప్రేమ ఉంటే: హిందూ మహాసభ సవాల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, షారూక్ ఖాన్ల భార్యలు కూడా లవ్ జిహాద్ బాధితులేనని హిందూ మహాసభ శుక్రవారం ఆరోపించింది. ఈ మేరకు హిందూ మహాసభ తన వారపత్రిక హిందూ సభా వార్త తాజా సంచికలో ఓ సంపాదకీయం ప్రచురించింది.
తమ భార్యలు కిరణ్ రావు, గౌరీ, కరీనా కపూర్ల పైన ప్రేమ ఉంటే అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సైఫ్ అలీఖాన్లు హిందూమతంలోకి రావాలని ఆ కథనంలో పేర్కొన్నారు. షారుక్ భార్య గౌరీ, అమీర్ భార్య కిరణ్ రావు, సైఫ్ భార్య కరీనా కపూర్లు లవ్ జిహాద్ బాధితులేనని పేర్కొంది.
అంతేకాకుండా ఫర్దీన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ కూడా హిందువులను పెళ్లి చేసుకున్నారని విమర్శించారు. దీనిపైన ఓ ఇంగ్లీష్ పత్రిక పుస్తకం సంపాదకులను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. దీనిపై సంపాదకులు మాట్లాడుతూ.. బాలీవుడ్ హీరోలకు వారి భార్యల పైన ప్రేమ ఉంటే హిందూ మతంలోకి మారాలని, ఇది తమ సవాల్ అని చెప్పినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు, లవ్ జిహాద్ బాధితులు అంటూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విశ్వహిందూ పరిషత్ నేతలు ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్కు ఓ జాబితాను అందజేశారు. అలాగే హిందూ యువతులను ఏమ్ర పేరుతో వల వేసి మతం మారేలా చేస్తున్నారని హిమాచల్ రాష్ట్రంలోని 23 స్వచ్చంధ సంస్థల పేర్లను పేర్కొంటూ, దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఓ వినతి పత్రం ఇచ్చారు.
గతంలో ఎవరైనా మతం మారితే స్థానిక డిప్యూటీ కమిషనర్కు తెలియజేయాల్సి ఉండేదని, కానీ కోర్టు ఈ నిబంధనను కొట్టి వేయడంతో బలవంతపు మతమార్పిళ్లకు అడ్డుకట్ట లేకుండా పోయిందని అంటున్నారు. బలవంతపు మతమార్పిళ్లను నిరోధించేందుకు సరికొత్త యంత్రాంగం ఏర్పాటు చేయాలన్నారు.
బంగ్లాదేశ్ నుండి నలభై వేల మంది ముస్లీంలు హిమాచల్ ప్రదేశ్లోకి అక్రమంగా చొరబడ్డారని, ముస్లీంలు, క్రైస్తవల జనాభా పెరిగిపోతోందని, దీనికి అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.