స్వీట్ పాకెట్ లో కత్తులు: అయోధ్యపై వాదనలు ముగిసిన వేళ.. హిందూ మహాసభ నాయకుడి దారుణ హత్య
లక్నో: చారిత్రాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు శాశ్వతంగా ముగిసిన వేళ.. ఈ కేసులో కీలక కక్షిదారుగా ఉన్న హిందూ మహాసభకు చెందిన ఓ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన పేరు కమలేష్ తివారి. శుక్రవారం ఉదయం ఆయన కార్యాలయానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం కత్తితో గొంతు కోశారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే కమలేష్ తివారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆయన మృతదేహంపై నాలుగు కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు ఉన్నాయి.
బాబ్రీ మసీదు కూల్చిన రోజే... రామ మందిరం నిర్మాణం : ఎంపీ సాక్షి మహారాజ్
ఉత్తర్ ప్రదేశ్ రాజధానిలో లక్నోలోని ఖుర్షీద్ బాగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కమలేష్ కాల్చివేత అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ మహాసభ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సినీ ఫక్కీలో ఈ హత్య చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాషాయ దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. వారి చేతుల్లో పూలదండలు, రెండు స్వీట్ పాకెట్లు ఉన్నాయి. కార్యాలయంలోనికి వచ్చిన తరువాత కమలేష్ తివారీ ఎక్కడ ఉన్నారని సిబ్బందిని అడిగారు.
ఛాంబర్ లోొ ఉన్నారని చెప్పడంతో అటుగా వెళ్లారు. కమలేష్ తివారిని చూసిన వెంటనే వారు ఆయనతో చేతులు కలిపారు. ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆ వెంటనే- స్వీట్ పాకెట్లలో దాచి ఉంచిన నాటు తుపాకితో కాల్పులు జరిపారు. ఊహించని ఈ పరిణామంతో తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నించారు. చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. ఛాతీపై పొడిచారు. అనంతరం గొంతు కోశారు. కత్తిపోట్లకు గురై నేల కూలిన కమలేష్ తివారిపై తుపాకితో కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లు ఆయన శరీరంలో దూసుకెళ్లాయి. ఆ వెంటనే వారు పారిపోయారు.
ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ కార్యాలయ సిబ్బంది ఆయనను కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనతో లక్నోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అప్రమత్తం అయ్యారు. సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ మహాసభ ప్రతినిధులు ఆసుపత్రి వద్ద నినాదాలు చేశారు. ఇటీవలే కమలేష్ తివారీ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇవే హత్యకు దారి తీసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.