ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేస్తాం: ‘14’పై హిందూ మహాసభ హెచ్చరిక
లక్నో: వాలెంటైన్స్ డే పేరిట పాశ్చాత్య ధోరణులు ప్రదర్శించవద్దని ప్రేమికులకు హిందూ మహాసభ హెచ్చరించింది. ఫిబ్రవరి 14న ప్రేమికులెవరైనా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే వారికి పెళ్లిళ్లు చేస్తామని స్పష్టం చేసింది. యువత పాశ్చాత్య సంప్రదాయాలను వీడాలని సూచించింది. దేశంలోని అన్ని నగరాలు, ప్రధాన పట్టణాల్లోని మాల్స్, పార్కులు, చారిత్రక కట్టడాల వద్ద తమ సంస్థ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తమ బృందాలు అక్కడికొచ్చే ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఇష్టమున్నవారికి అక్కడే పెళ్లి కూడా చేస్తారు అని హిందూ మహాసభ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌషిక్ శుక్రవారం మీడియాకు తెలిపారు. పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం గులాబీ పూలు, గ్రీటింగ్కార్డులు పట్టుకుని తిరిగేవారికి కౌన్సెలింగ్ ఇస్తామని, వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తామన్నారు.
ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేక దినం ఏదీ అవసరం లేదని స్పష్టం చేశారు. ‘మనదేశంలో ఏడాది పొడవునా, 365 రోజులు ఇష్టవారికి ప్రేమను వ్యక్తం చేయవచ్చు. వీధుల వెంట, పార్కుల్లో కాదు' అని ఆయన పేర్కొన్నారు. పాశ్చాత్య ధోరణులకు అలవాటుపడి యువత చెడిపోతుండటాన్ని తమ సంస్థ అంగీకరించదని.. వారి సక్రమ మార్గంలో నడిపించేందుకు తమవంతు కృషి చేస్తున్నామని తెలిపారు.
వేర్వేరు మతాలకు చెందిన ప్రేమికులైతే.. వారు హిందూ మతం తీసుకుని తమ ప్రేమను నిరూపించుకోవాల్సిందిగా కోరుతామని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ హిందువే.. అప్పుడున్న పరిస్థితుల్లో వేర్వేరు మతాల్లోకి వెళ్లారని తెలిపారు. ఒకవేళ వాళ్లు అందుకు అంగీకరించకపోతే లవ్ జిహాద్గా పరిగణిస్తామని పేర్కొన్నారు. అలాంటి వారిని హిందూమతంలోకి మార్చిపెళ్లి చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారమంతా పూర్తి శాంతియుత వాతావరణంలో జరుగుతుందని తెలిపారు.