గాడ్సే కోసం హిందూ మహాసభ పెద్ద ఎత్తున ప్రచారం... లక్నోలో బైక్ ర్యాలీ
లక్నో: దేశ వ్యాప్తంగా నాథూరాం గాడ్సేకు ప్రచారం కల్పించాలని హిందూ మహాసభ అందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ మేరకు లక్నోలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించాలని కసరత్తు చేస్తోంది. జాతిపిత మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న విషయంపై ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని భావిస్తోంది.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
బైక్ ర్యాలీ సమయంలో బాప్తమావ్ గ్రామంలో గాడ్సే విగ్రహం ప్రతిష్టించాక 'భూమి పూజన్' నిర్వహించనున్నట్లు హిందూ మహాసభ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలేష్ తివారీ తెలిపారు. ఈ బైక్ ర్యాలీ కుర్షద్ బాగ్లోని హిందూ మహాసభ భవన్ నుంచి ప్రారంభమై చార్బాగ్, ఆలంబాగ్, చౌక్, అమినాబాద్ మీదగా బాప్తమావ్ గ్రామానికి చేరుతుందన్నారు.
ఈ జన్ జాగరన్ బైక్ ర్యాలీకి అనుమతి లభించిందని తెలిపారు. గాడ్సేను కీర్తించడం అక్రమమేమీ కాదని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే డిసెంబర్ 26న సీతాపూర్ జిల్లాలో శాంతికి భంగం కలిగించే పనులు చేస్తున్నారంటూ కమలేష్ తివారీతో పాటు మరో 25 మందిపై జిల్లా యంత్రాంగం కేసు నమోదు చేసింది.