'హిందువులను చంపిన ఔరంగ జేబు పేరిట రోడ్లు... గాడ్సే ప్రతిమలను నిలబెట్టాల్సిందే'
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాధూరాం గాడ్సే ప్రతిమలను నిలబెట్టాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు చంద్ర ప్రకాశ్ కౌశిక్ అన్నారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ ఒకటి లేదా రెండు రోజుల్లో గాడ్సే ప్రతిమలను నిలబెట్టేందుకు తగిన స్ధలం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.
ఎంతో మంది హిందువులను చంపిన ఔరంగ జేబు పేరు మీద మన దేశంలో రోడ్లు ఉన్నాయని, అలాంటప్పుడు నాధూరాం గాడ్సే ప్రతిమలను ఎందుకు నిలబెట్టకూడదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు నిరాకరిస్తే, తామే అన్ని రాష్ట్రాల్లోని హిందూ మహాసభ కార్యాలయాల్లో గాడ్సే ప్రతిమలు ఏర్పాటు చేస్తామన్నారు.
దేశ వ్యాప్తంగా అఖిల భారత హిందూ మహాసభకు 17 నుంచి 18 వరకు భవన్లు ఉన్నాయని గుర్తు చేశారు. నాధూరాం గాడ్సే పాలరాయి ప్రతిమ సెంట్రల్ ఢిల్లీలోని మందిర్ మార్గ్లో ఉన్న తన ఆఫీసులో ఒక మూల ఉందని చెప్పారు.
ఈ పాలరాతి ప్రతిమను రాజస్ధాన్లోని కిషన్గడ్లో తయారు చేయించానని తెలిపారు. ఈ ప్రతిమ ఖర్చు రూ. 17,000లని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీని నాధూరాం గాడ్సే జనవరి 30, 1948న కాల్చి చంపాడని... నాధూరాం గాడ్సే ఓ దేశభక్తుడని పేర్కొన్నారు. స్వతంత్రం కోసం పోరాటంలో స్వల్ప పాత్ర పోషించిన గాంధీలా కాకుండా, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన దేశభక్తుడు గాడ్సే అని కౌశిక్ అభివర్ణించారు.
ఇటీవల ఉన్నావ్ బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ గాడ్సేను దేశభక్తుడిగా వ్యాఖ్యానించి... ఆ వ్యాఖ్యను పార్లమెంట్లో వెనక్కి తీసుకున్నతరుణంలో తమకు దేశ వ్యాప్తంగా గాడ్సే ప్రతిమలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని ఆయన చెప్పారు.